వాషింగ్టన్ : భారత్, అమెరికా మధ్య రక్షణ బంధం మరింత బలోపేతం కానున్నది. హర్పూన్ మిస్సైళ్ల ( Harpoon Missile ) ను ఇండియాకు అమ్మేందుకు అమెరికా ఆమోదం తెలిపింది. యాంటీ షిప్ హర్పూన్ మిస్సైళ్ల కోసం ఇండియా సుమారు 82 మిలియన్ల డాలర్లు ఖర్చు చేయనున్నది. క్షిపణుల అమ్మకాలతో రెండు దేశాల మధ్య వ్యూహాత్మక బంధం మరింత బలోపేతం కానున్నట్లు అధికారులు తెలిపారు. మిస్సైళ్ల అమ్మకాల గురించి పెంటగాన్ రక్షణ సహకార ఏజెన్సీ.. దీనికి సంబంధించిన రిపోర్ట్ను అమెరికా ఉభయసభలకు చేరవేసింది. హర్పూన్ జాయింట్ కామన్ టెస్ట్ సెట్ (జేసీటీఎస్)ను కొనుగోలు చేసేందుకు భారత ప్రభుత్వం రిక్వెస్ట్ చేసిందని, దానికి చెందిన లాజిస్టిక్స్ కూడా కుదిరినట్లు అమెరికా ఒక ప్రకటనలో చెప్పింది. వాతావరణం ఏదైనా దానికి తగినట్లు హర్పూన్ క్షిపణి పనిచేస్తుంది. యాంటీ షిప్ మిస్సైల్ సిస్టమ్ను తొలిసారి 1977లో డెవలప్ చేశారు.