కొండపాక, జూన్ 20: ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు తన కాన్వాయ్లో సిద్దిపేట నుంచి హైదరాబాద్కు వెళ్తుండగా రోడ్డు ప్రమాదం జరిగింది. ఇందులో పలు వాహనాలు స్వల్పంగా దెబ్బతినగా మంత్రి క్షేమంగా బయటపడ్డారు. సిద్దిపేటలో సీఎం పర్యటన ముగిసిన అనంతరం ఆదివారం రాత్రి మంత్రి హరీశ్రావు తన కాన్వాయ్లో హైదరాబాద్కు బయలుదేరారు. కొండపాక మండలం నాగులబండ వద్ద ఓ ప్రైవేటు వాహనం మంత్రి కాన్వాయ్ను దాటుతూ ముందుకు వెళ్లింది. అదే సమయంలో అడవి పంది రోడ్డుపైకి రావడంతో ప్రైవేటు వాహన డ్రైవర్ అకస్మాత్తుగా బ్రేక్ వేయడంతో ఆ వెనుకే వస్తున్న మంత్రి ఎస్కార్ట్ వాహనాలు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కాన్వాయ్లో ఉన్న మంత్రి వాహనం ముందు, వెనుక దెబ్బతిన్నప్పటికీ మంత్రి క్షేమంగా బయటపడ్డారు. డ్రైవర్, గన్మెన్లకు స్వల్ప గాయాలయ్యాయి. ఆ వెంటనే హరీశ్రావు మరో వాహనంలో హైదరాబాద్కు బయలుదేరి వెళ్లారు. ప్రమాదం జరిగిన విషయాన్ని తెలుసుకున్న టీఆర్ఎస్ కార్యకర్తలు, అభిమానులు తీవ్ర ఆందోళనకు గురైనప్పటికీ, ఆయనకు ఏమీ కాలేదని తెలియడంతో ఊపిరి పీల్చుకున్నారు.