న్యూయార్క్ : సాంకేతిక సమస్యతో అమెరికా వ్యాప్తంగా బుధవారం వందలాది విమానాలు నిలిచిపోగా, ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ)వ్యవస్ధలో లోటుపాట్లను సరిచేయడంతో విమాన సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.
కీలక సమాచారాన్ని పైలట్లకు చేరవేయడంతో పాటు రన్వే వివరాలను తెలిపే కీలక వ్యవస్ధ నోటమ్ (నోటీస్ టు ఎయిర్ మిషన్స్) స్తంభించడంతో విమాన సర్వీసులకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఆపై అధికారులు శ్రమించి దాన్ని పునరుద్ధరించడంతో ఎయిర్ సర్వీసులు పున:ప్రారంభమయ్యాయి. సాంకేతిక సమస్యతో 1300 విమానాలు నిలిచిపోగా, వేలాది విమానాలు ఆలస్యమయ్యాయి.
ఎఫ్ఏఏ వ్యవస్ధ స్తంభించడంతో పది లక్షల మందికిపైగా ప్రయాణీకులకు తీవ్ర అసౌకర్యం వాటిల్లింది. కాగా, డేటాబేస్ ఫైల్ దెబ్బతినడంతో సేఫ్టీ అలర్ట్ వ్యవస్ధలో ఇబ్బందులు తలెత్తినట్టు కనిపిస్తోందని ఎఫ్ఏఏ పేర్కొంది. మరోసారి ఎలాంటి వైఫల్యం చోటుచేసుకోకుండా చర్యలు చేపట్టామని ట్రాన్స్పోర్టేషన్ కార్యదర్శి పీట్ బుటిగెగ్ తెలిపారు. సైబర్ అటాక్తోనే సాంకేతిక వైఫల్యం జరిగిందనేందుకు ఎలాంటి సంకేతాలు లేవని ఆయన పేర్కొన్నారు. అయితే పూర్తి వివరాలు వెల్లడయ్యేవరకూ సైబర్ అటాక్ను తోసిపుచ్చలేమని అధికారులు తెలిపారు.