కాబూల్: ఆఫ్ఘనిస్థాన్లో తాజా పరిణామాలపై ఐక్యరాజ్యసమితి ఆందోళన వ్యక్తంచేసింది. బలప్రయోగంతో అధికారం చేజిక్కించుకోవడం అంతర్యుద్ధానికి దారితీస్తుందని ఐరాస ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెరస్ ( Guterres ) వ్యాఖ్యానించారు. తాలిబన్లు దేశాన్ని హస్తగతం చేసుకోవడంపై ప్రపంచ దేశాలు కూడా స్పందిస్తున్నాయి. ఆఫ్ఘనిస్థాన్లో సంక్షోభ పరిస్థితులను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ చెప్పారు.
మరోవైపు కాబూల్ ఎయిర్ పోర్టు నుంచి విమానాల రాకపోకలు నిలిచిపోయాయి. అయితే, రక్షణ విమానాల కార్యకలాపాలు కొనసాగుతాయని నాటో అధికారులు ప్రకటించారు. అదేవిధంగా తాలిబన్ల భయంతో దేశం వీడుతున్న ఆఫ్ఘన్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది. దీంతో సరిహద్దులు దాటి వస్తున్న శరణార్థులను అడ్డుకునేందుకు టర్కీ, ఇరాన్ చర్యలు చేపట్టాయి. భద్రతను మరింత కట్టుదిట్టం చేశాయి. ఆఫ్ఘనిస్థాన్లో పరిస్థితులను చక్కదిద్దేందుకు పాకిస్థాన్తో కలిపి పని చేస్తామని టర్కీ ప్రకటించింది.