న్యూఢిల్లీ : ఉక్రెయిన్లో రష్యా దమనకాండ నేపధ్యంలో బుచా నగరంలో మారణహోమాన్నిభారత్ తీవ్రంగా ఖండిస్తుందని విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ సంక్షోభంపై బుధవారం లోక్సభలో చర్చ సందర్భంగా ఆయన బుచా హింసాకాండను ఖండించారు. బుచాలో జరిగిన హత్యాకాండను తాము తీవ్రంగా ఖండిస్తున్నామని ఈ ఉదంతంపై స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలనే డిమాండ్కు మద్దతు ఇస్తామని చెప్పారు. మరోవైపు తమ దేశంపై రష్యా సాగించిన దురాగతాలను నిరోధించడంలో ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఘోరంగా విఫలమైందని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ అసంతృప్తి వ్యక్తం చేశారు.
తక్షణం స్పందించి రష్యాను శిక్షించాలని.. అది చేయలేకుంటే ఐరాసను రద్దు చేసుకోవాలని అన్నారు. భద్రతా మండలి నుంచి రష్యాను తొలగించాలని కోరారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రారంభమైన తర్వాత ఆయన తొలిసారిగా ఐరాస భద్రతా మండలి(యూఎన్ఎస్సీ) సమావేశంలో వర్చువల్గా మాట్లాడారు. బుచా నగరంలో రష్యా సేనలు మారణహోమానికి పాల్పడ్డాయని, వందలాది మందిని ఉద్దేశపూర్వకంగా చంపేశాయని ఆవేదన వ్యక్తం చేశారు.రష్యా బలగాలను జెలెన్స్కీ ఉగ్రవాదులతో పోల్చారు.
తమ దేశంలో రష్యా సైనికులు సాగించిన అరాచకాలు, ఐసిస్ ఉగ్రవాదుల దారుణాలకు మధ్య పెద్ద తేడా ఏమీ లేదని అన్నారు. భద్రతా మండలిలో వీటో అధికారం ఉన్న దేశంతో తాము పోరాడుతున్నామని అన్నారు. యూఎన్ఎస్సీని పునర్వ్యవస్థీకరించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి యూఎన్ఎస్సీలో మాట్లాడుతూ బుచా నగరంలో పౌరుల హత్యలను నిస్సందేహంగా ఖండిస్తున్నామన్నారు. ఆయా ఘటనలపై స్వతంత్ర దర్యాప్తు డిమాండ్కు మద్దతు పలుకుతున్నట్టు తెలిపారు.