UNICEF Photo of the Year | యూనిసెఫ్ సంస్థ జర్మనీ ఆధ్వర్యంలో నిర్వహించిన యూనిసెఫ్ ఫోటో ఆఫ్ ది ఇయర్ పోటీల్లో ఈసారి భారత్కు రెండు అవార్డులు దక్కాయి. ఫస్ట్, సెకండ్ అవార్డులు భారత్కే దక్కడం విశేషం. యూనిసెఫ్ ఫోటో ఆఫ్ ది ఇయర్ కోసం అంతర్జాతీయ పోటీలను ప్రతి సంవత్సరం నిర్వహిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యలు, వాళ్లను చైతన్య పరిచే పరిస్థితుల మీద ఫోటోలు తీయాల్సి ఉంటుంది. వచ్చిన ఎంట్రీలలో యూనిసెఫ్ ఫోటో ఆఫ్ ది ఇయర్తో పాటు సెకండ్, థర్డ్, కాంప్లిమెంట్ అవార్డులను యూనిసెఫ్ జ్యూరీ ప్రకటించింది.
ఇందులో మొదటి, రెండు అవార్డులు భారత్కు దక్కాయి. మొదటి స్థానంలో నిలిచిన ఫోటోను భారత ఫోటోగ్రాఫర్ సుప్రతిమ్ భట్టాచార్జీ తీశాడు. ఇండియా, బంగ్లాదేశ్ బార్డర్లో సుందర్బన్స్ అనే కోస్తా ప్రాంతంలో నివసించే ప్రజలు భారీ తుఫాను వల్ల నష్టపోవడంతో… అక్కడికి వెళ్లిన సుప్రతిమ్.. అక్కడి ప్రజలు నష్టపోయిన తీరును తన ఫోటోల్లో బంధించాడు. నామ్ఖానా ఐలాండ్లో చిన్న టీ షాప్ పెట్టుకొని జీవనం సాగిస్తున్న పల్లవి, తన ఫ్యామిలీ.. తుఫాను వల్ల టీ కొట్టు నాశనం అవడంతో దిక్కుతోచని స్థితికి చేరారు. టీకొట్టు నీళ్లలో కొట్టుకుపోవడంతో దీన స్థితిలో ఉన్నప్పుడు సుప్రతిమ్ తీసిన ఆ ఫోటో మొదటి స్థానంలో నిలిచింది.
కరోనా మహమ్మారి వల్ల చాలా నెలల పాటు స్కూళ్లు మూతపడిన విషయం తెలిసిందే. దీంతో పిల్లలంతా చదువులో కాస్త వెనుకబడ్డారు. ఆన్లైన్ క్లాసులంటూ కొన్ని స్కూళ్లు.. ఆన్లైన్లో పాఠాలు చెప్పడం ప్రారంభించాయి. కానీ.. ఆన్లైన్లో పాఠాలు వినాలంటే ఖచ్చితంగా స్మార్ట్ఫోన్ లేదంటే లాప్టాప్ ఉండాల్సిందే. వేల రూపాయలు ఖర్చు చేసి.. స్మార్ట్ఫోన్ కొనలేని పేద విద్యార్థులకు.. దీప్ నారాయణ్ నాయక్ అనే ఓ టీచర్ గోడ పాఠాలు చెప్పడం ప్రారంభించాడు.
గోడల మీద బ్లాక్ బోర్డులను తయారు చేయించి.. పిల్లలకు అక్కడ పాఠాలు నేర్పిస్తున్నాడు. సౌరవ్ దాస్ అనే భారత ఫోటోగ్రాఫర్ తీసిన ఈ ఫోటో రెండో స్థానంలో నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా లాక్ డౌన్ మూలంగా 1.6 బిలియన్ పిల్లలు స్కూల్కు వెళ్లలేకపోయారని యూనిసెఫ్ ఈ సందర్భంగా వెల్లడించింది.
ఓ వ్యక్తికి రెండు చేతులు లేవు. కాళ్లు లేవు. యుద్ధంలో తన కాళ్లు చేతులను పోగొట్టుకున్నాడు. ఇస్లామిక్ స్టేట్ టెర్రరిస్టులతో జరిగిన పోరులో అలా చాలామంది పిల్లల తండ్రులు తమ జీవితాన్నే పోగొట్టుకున్నారు. అటువంటి తండ్రులకు తోడుగా పిల్లలు భవిష్యత్తులో ఉంటారు అనే విధంగా ఇరాక్కు చెందిన ఫోటోగ్రాఫర్ యోనెస్ మహమ్మద్ తీసిన ఫోటోకు మూడో ప్రైజ్ దక్కింది.
మొదటి మూడు స్థానాల్లో నిలిచిన ఫోటోలతో పాటు.. మరో 9 ఫోటోలను కూడా జ్యూరీ ఎంపిక చేసింది. వాటిలో సిరియాలో బాంబుల వర్షం తర్వాత అక్కడి వాతావరణాన్ని పిల్లలు ఎలా తట్టుకున్నారు అనే అర్థం వచ్చే ఫోటో అది. ఆ తర్వాత ఇరాన్, నైజీరియా, జర్మనీ, స్విట్జర్లాండ్, సింగపూర్, జర్మనీ, ఫిలిప్పైన్స్, రష్యాకు చెందిన ఫోటోలకు బహుమతులు లభించాయి.