వాషింగ్టన్: అమెరికాలో దారుణం చోటుచేసుకుంది. ఓ భారతీయ విద్యార్థిపై తోటి భారతీయులే అమానుషంగా వ్యవహరించారు. నిర్బంధించి చిత్రహింసలకు గురిచేశారు. తాజాగా పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ప్రాసిక్యూటర్ జో మెక్కుల్లోచ్ వెల్లడించిన వివరాల ప్రకారం, భారతీయ విద్యార్థి ఒకరు (20 ఏళ్ల వయసు) గత ఏడాది ఉన్నత చదువు కోసం అమెరికా వెళ్లారు. సెయింట్ చార్లెస్ కౌంటీలో ఉంటున్న వెంకటేశ్ ఆర్ సత్తారు, శ్రావణ్ వర్మ పెనుమెచ్చ, నిఖిల్ వర్మ పెన్మత్స ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఆ విద్యార్థిని నిర్బంధించి, ఇష్టానుసారం కొడుతూ, ఆహారం పెట్టకుండా, నిద్రపోనివ్వకుండా, వెట్టి చాకిరీ చేయించుకుంటున్నారు.
వీరందరికీ భారత్లో రాజకీయ పలుకుబడి అధికంగా ఉంది. బాధితుని పరిస్థితిని గమనించిన ఓ వ్యక్తి పోలీసులకు ఫోన్ చేశారు. దీంతో బుధవారం పోలీసులు వీరి ఇళ్లపై దాడి చేసి, బాధితునికి విముక్తి కల్పించారు. బాధితుని ఎముకలు విరిగిపోవడం, శరీరమంతా గాయాలు ఉండటంతో దవాఖానకి తరలించారు. బాధితుడు మాట్లాడుతూ, వెంకటేశ్కు తమ దేశంలో రాజకీయ పలుకుబడి ఉందని, చాలా సంపన్నుడని, పోలీసులకు ఫిర్యాదు చేస్తే, తనతోపాటు తన కుటుంబ సభ్యులకు హాని జరుగుతుందని తాను భయపడ్డానని చెప్పారు. మిసోరీ విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసించడం కోసం తాను ఇక్కడికి వచ్చానని తెలిపారు.