బీజింగ్, ఏప్రిల్ 11: కరోనా కట్టడికి చైనా అనుసరిస్తున్న ‘జీరో కొవిడ్’ పాలసీపై అక్కడి ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వైరస్ నియంత్రణ పేరిట తమను వారం రోజులుగా ఇండ్లకే పరిమితం చేయడంపై మండిపడుతున్నారు. బయటకు విడిచిపెట్టాలంటూ షాంఘైలోని పలు అపార్ట్మెంట్ వాసులు కిటికీల్లో నుంచి కేకలు వేయడం వీడియోల్లో కనిపిస్తున్నది. ‘విడిచిపెట్టకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయ’ని ఒక వ్యక్తి అధికారులను బెదిరించడం, దయచేసి మమ్మల్ని విడిచిపెట్టండంటూ ఓ మహిళ బతిమిలాడటం వీడియోల్లో ఉన్నది. ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2 కారణంగా నగరంలో రోజుకు సగటున పాతిక వేల కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఏప్రిల్ 5 నుంచి నగరవ్యాప్తంగా అధికారులు సంపూర్ణ లాక్డౌన్ విధించారు. మరోవైపు, పౌరుల ఆగ్రహం కట్టలుతెంచుకొంటే పరిణామాలు తీవ్రంగా ఉండొచ్చని అమెరికా వైద్య నిపుణుడు ఎరిక్ ఫిజిల్ డింగ్ హెచ్చరించారు. చైనాలో కేసులు పెరుగడానికి బీఏ.2 వేరియంట్ కారణమని వెల్లడించారు.