జెనీవా: ఉక్రెయిన్పై రష్యా దండయాత్ర సుదీర్ఘంగా కొనసాగుతున్నది. ఫిబ్రవరి 24న ప్రారంభమైన రష్యా దాడి ఇప్పటికే 50కిపైగా రోజులు పూర్తయ్యాయి. దీంతో యుద్ధభూమి ఉక్రెయిన్ నుంచి సుమారు 47 లక్షల మంది ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఇతర దేశాలకు శరణార్థులుగా వెళ్లారు. ఇందులో మహిళలు, చిన్నారులే అధికంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి వెల్లడించింది. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత యూరప్లో పెద్దసంఖ్యలో మానవ వలసలు జరగడం ఇదే మొదటిసారని తెలిపింది.
రష్యా దాడి ప్రారంభమైన తర్వాత ఉక్రెయిన్ నుంచి ఇప్పటివరకు 47,36,471 మంది వలసవెళ్లారని ఐరాస రెఫ్యూజీ ఏజెన్సీ యూఎన్హెచ్సీఆర్ గురువారం ప్రకటించింది. బుధవారం ఒక్కరోజే 79,962 దేశం విడిచివెళ్లారని పేర్కొన్నది. ఇలా ఇతదేశాల్లో శరణార్థులుగా ఉన్నవారిలో 90 శాతం మంది మహిళలు చిన్నారులే ఉన్నారని తెలిపింది. 18 నుంచి 60 ఏండ్ల వయస్సు లోపున్న పురుషులు యుద్ధంలో పాల్గొనాల్సి ఉన్న నేపథ్యంలో శరణార్థుల్లో వారి సంఖ్య తక్కువగా ఉన్నదని వెల్లడించింది. ప్రభుత్వ గణాంకాల ప్రకారం ఉక్రెయిన్ మొత్తం జనాభా 3 కోట్లా 70 మంది. (రష్యా ఆధీనంలో ఉన్న క్రిమియా, వేర్పాటు వాద ప్రాంతాలు కాకుండా).
కాగా, 70 లక్షల మంది తమ ఇండ్లను వదిలి వెళ్లారని ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ మైగ్రేషన్ (ఐఓఎం) తెలిపింది. కాగా, ఉక్రెయిన్లో చదువు, ఉద్యోగాల కోసం వచ్చినవారిలో సుమారు 2 లక్షల 15 వేల మంది దేశం విడిచి వెళ్లారని ప్రకటించింది.
ఉక్రెనియన్లు అత్యధికంగా పొలండ్కు 26,94,090 మంది వలస వెళ్లారు. ఇక , రొమేనియాకు 7,16,797, రష్యాకు 4,71,014, హంగరీ 4,40,387, మాల్డోవా 4,17,650, స్లొవేకియా 3,26,244, బెలారస్లో 22,428 మంది శరణార్థులుగా తల దాచుకుంటున్నారు.