కీవ్: తమపై యుద్ధానికి దిగిన రష్యా భారీగా మూల్యం చెల్లించుకుంటున్నదని ఉక్రెయిన్ తెలిపింది. తమ ఆర్మీ 4,300 మంది రష్యా సైనికుల్ని హతమార్చిందని ఉక్రేనియన్ డిప్యూటీ రక్షణ మంత్రి హన్నా మాల్యార్ ఆదివారం తెలిపారు. ఇది ధృవీకరించిన సంఖ్య అని చెప్పారు. రష్యాకు చెందిన 146 యుద్ధ ట్యాంకులు, 27 యుద్ధ విమానాలు, 26 హెలికాప్టర్లను ఉక్రెయిన్ ఆర్మీ ధ్వంసం చేసినట్లు ఫేస్బుక్ ద్వారా ఆమె వెల్లడించారు.
కాగా, ఉక్రెయిన్తో రష్యా యుద్ధం ఆదివారం నాటికి నాలుగో రోజుకు చేరింది. మరోవైపు రష్యా దళాలు ఉక్రెయిన్ రాజధాని కీవ్ వైపునకు దూసుకెళ్తున్నాయి. తాజాగా ఉక్రెయిన్ రెండో పెద్ద నగరమైన ఖార్కీవ్కు రష్యా దళాలు చేరాయి. అయితే ఉక్రెయిన్ ఆర్మీ కూడా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. రష్యా సైనిక కాన్వాయ్ను నాశనం చేసినట్లు ఉక్రెయిన్ ఆర్మీ తెలిపింది. తమ పోరాట ధాటిని రష్యా సైన్యం తట్టుకోలేకపోతున్నదని పేర్కొంది. దీనికి సంబంధించి పలు వీడియోలను విడుదల చేసింది.
Smashed #Russian military convoy in #Kharkiv pic.twitter.com/mbATqcIBCH
— NEXTA (@nexta_tv) February 27, 2022