కీవ్ : ఉక్రెయిన్లో రష్యా బలగాల దాడిలో అమెరికా జర్నలిస్ట్ మృతి చెందాడు. ఆదివారం కీవ్ శివారులోని ఇర్పిన్లో న్యూయార్క్ టైమ్స్ జర్నలిస్ట్ మృతి చెందగా.. మరో జర్నలిస్ట్ గాయపడ్డట్లు ఉక్రెయిన్ అధికారులు ధ్రువీకరించారు. పశ్చిమ ఉక్రెయిన్లోని ఎల్వివ్కు వాయువ్యంగా 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న యావోరివ్ మిలటరీ రేంజ్పై రష్యా దళాలు ఎనిమిది రాకెట్లను ప్రయోగించాయి. రష్యా దాడులు పోలాండ్ సరిహద్దు వరకు కొనసాగాయి.
ఇదిలా ఉండగా.. కీవ్ సమీపంలోని శరణార్థుల కాన్వాయ్పై రష్యన్ సైన్యం దాడి చేయడంతో ఓ చిన్నారి సహా ఏడుగురు ఉక్రేయిన్ పౌరులు మృతి చెందారని ఉక్రెయిన్ పేర్కొంది. ఇరుదేశాల మధ్య యుద్ధం ఆదివారం నాటికి 18వ రోజుకు చేరగా.. ఓ వైపు ఉక్రెయిన్ నగరాలపై రష్యా సైన్యం దాడులు చేస్తున్నది. ఉక్రెయిన్ సైతం తీవ్రంగా ప్రతిఘటిస్తున్నది. ఇప్పటివరకు 13వేల మందికిపైగా రష్యా సైనికులను చంపినట్లు ఉక్రెయిన్ పేర్కొంది. మరోవైపు ఉక్రెయిన్కు 200 మిలియన్ డాలర్ల సైనిక సాయాన్ని అందజేస్తామని అమెరికా ప్రకటించిన విషయం తెలిసిందే.