కీవ్: ఉక్రెయిన్పై రష్యా మిస్సైళ్ల(Missiles Attack) వర్షం కురిపించింది. ఆ దేశంలోని అన్ని నగరాలపై ఇవాళ ఉదయం నుంచి క్షిపణులు ఊడిపడ్డాయి. రష్యా ఆ దాడులకు పాల్పడినట్లు ఉక్రెయిన్ ఆరోపిస్తోంది. క్రిమియా బ్రిడ్జ్ను ధ్వంసం చేసిన నేపథ్యంలో రష్యా మెరుపు దాడికి దిగింది. సుమారు 75 మిస్సైళ్లతో రష్యా దాడి చేసినట్లు ఉక్రెయిన్ సైనిక దళాల కమాండర్ ఇన్ చీఫ్ వలేరి జాలుజిని తెలిపారు. అయితే వీటిలో 41 క్షిపణులను అడ్డుకున్నట్లు కూడా ఆయన చెప్పారు.
ఉక్రెయిన్ నగరాలపై భీకర దాడులు జరిగిన విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ వీడియో సందేశంలో ద్రువీకరించారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో రష్యా క్షిపణులు పడినట్లు ఆయన చెప్పారు. ఇంధన మౌళికసదుపాయాల్ని రష్యా టార్గెట్ చేసినట్లు ఆయన ఆరోపించారు. భయాందోళనలు సృష్టించేందుకు రష్యా ప్రయత్నిస్తున్నట్లు జెలెన్స్కీ తెలిపారు. లివివ్, ఖార్కివ్, ఒడిసా పట్టణాల్లోనూ దాడులు జరిగినట్లు స్థానిక అధికారులు వెల్లడించారు.
రాజధాని కీవ్లోని సెక్యూర్టీ సర్వీస్ ఆఫ్ ఉక్రెయిన్ (ఎస్బీయూ) ప్రధాన కార్యాలయం దాడిలో ధ్వంసమైంది. దాడుల నేపథ్యంలో మెట్రో సర్వీసులను ఆపేశారు. స్టేషన్లను ఆశ్రయ కేంద్రాలుగా వాడుతున్నారు. కీవ్లో ఇటీవల కొత్తగా నిర్మించిన పాదాచారుల, సైక్లింగ్ బ్రిడ్జ్ను కూడా క్షిపణి దాడితో పేల్చేశారు. క్లిచ్కో బ్రిడ్జ్ను 2019లోనే ప్రారంభించారు. డినిపర్ నది సమీపంలో ఉన్న ఈ బ్రిడ్జ్ పాపులర్ అట్రాక్షన్ సెంటర్. ఈ బ్రిడ్జ్ దాదాపు 212 మీటర్ల పొడువు, 32 మీటర్ల ఎత్తు ఉంటుంది. బ్రిడ్జ్ పేలన సమయంలో దానిపై ఎవరైనా ఉన్నారా, ఏదైనా ప్రాణ నష్టం జరిగిందా అన్న విషయాలు ఇంకా తెలియరాలేదు.