రష్యా సైనికుల బాంబుల వల్ల ఉక్రెయిన్ దద్దరిల్లిపోతోంది. ఉక్రెయిన్లోని ఖార్ఖీవ్ పట్టణంపై మిస్సైల్తో దాడి చేశారు. ప్రజల నివాసాలపై కూడా దాడులు జరిగాయి. దీంతో అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గురువారం ఉదయం వరకూ ఖార్ఖీవ్ పట్టణంలో కర్ఫ్యూ విధిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. రష్యా బలగాలు బాంబులతో విరుచుకుపడుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.
ఖార్కివ్ నగరంపై రష్యా దాడులు కొనసాగిస్తూనే ఉన్నది. తాజాగా ఖార్కివ్ పోలీసు బిల్డింగ్పై మిస్సైల్ అటాక్ జరిగినట్లు తెలుస్తోంది. సిటీలో ఉన్న పోలీసు డిపార్ట్మెంట్ బిల్డింగ్ను క్షిపణితో పేల్చేసినట్లు ఓ వార్తా సంస్థ తెలిపింది. పోలీసు బిల్డింగ్ పూర్తిగా మంటల్లో దగ్దమైనట్లు ఓ వీడియో రిలీజైంది. కరాజిన్ నేషనల్ యూనివర్సిటీలో ఉన్న ఓ బిల్డింగ్ కూడా ధ్వంసమైనట్లు ఆ దేశ కేంద్ర హోంశాఖ వెల్లడించింది. మరోవైపు కేవలం నాలుగు గంటల్లో ఖార్ఖీవ్ను విడిచి వెళ్లాలని అక్కడి భారతీయులకు భారత్ ఎంబసీ సూచించింది. నగర శివార్లలోని పెసోచిన్, బబాయే, బెజ్లిడోవ్కా వైపు ఎంత త్వరగా వీలైతే అంత వేగంగా వెళ్లాలని, స్థానిక కాలమాన ప్రకారం సాయంత్రం 6 గంటల వరకు ఆయా ప్రాంతాలకు చేరుకోవాలంటూ సూచనలు చేసింది.