కీవ్: నాటో కూటమిలో తాము చేరాలనుకోవడంలేదని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ సంచలన ప్రకటన చేశారు. తమపై దాడులకు తెగబడుతున్న రష్యాపై ఆ కూటమి పోరాడటంలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ భూభాగంలోని ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా ప్రకటించిన రష్యా నిర్ణయంపై కూడా రాజీపడనున్నట్టు ప్రకటించారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రకటించడానికి ప్రధాన కారణాలు ఇవే కావడం గమనార్హం. మరోవైపు, యుద్ధం నేపథ్యంలో తాను పోలండ్కు పారిపోయానన్న వార్తలనూ జెలెన్స్కీ తోసిపుచ్చారు. కీవ్లోని తన అధికారిక కార్యాలయంలోనే ఉన్నట్టు పేర్కొన్నారు. ఈ మేరకు ఇన్స్టాగ్రామ్లో లొకేషన్ షేర్ చేశారు. రష్యా దండయాత్ర.. ఉక్రెయిన్తో ముగియబోదని, ప్రపంచంలో ఇతర దేశాలపై కూడా ప్రభావం చూపుతుందని హెచ్చరించారు. తినేకొద్దీ ఆ మృగం ఇంకా కావాలంటూ మిగిలిన దేశాలపైనా దాడికి దిగుతుందని పుతిన్ను ఉద్దేశిస్తూ నిప్పులు చెరిగారు.
మరియుపోల్లో దాదాపు మూడు లక్షల మంది ఉక్రెయిన్ పౌరులను రష్యా సేనలు బందీలుగా ఉంచాయని ఉక్రెయిన్ విదేశాంగమంత్రి దిమిట్రో కులేబా ఆరోపించారు. రష్యా యుద్ధంలో 400 మంది వరకూ ఉక్రెయిన్ పౌరులు మరణించారని, ఇందులో 38 మంది పిల్లలు ఉన్నారని ఉక్రెయిన్ రక్షణ శాఖ తెలిపింది.