ఉక్రెయిన్పై ఇటీవలి కాలంలో రష్యా దాడులు మరింతగా పెరిగాయి. రష్యాకు సంబంధించిన బ్రిడ్జిని ఉక్రెయిన్ దళాలు కూల్చేయడంతో రష్యా తమ దాడుల తీవ్రతను మరింత పెంచింది. ముఖ్యంగా ఎనర్జీ సదుపాయాలను రష్యా టార్గెట్ చేస్తోంది. ఈ క్రమంలోనే శనివారం నాడు రష్యా దళాలు మరిన్ని ఎనర్జీ సదుపాయాలపై దాడులు చేశాయని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఆరోపించారు.
రష్యా దళాలు 36 రాకెట్లను లాంచ్ చేశాయని, దీంతో 15 లక్షల మంది ప్రజలు ఎలక్ట్రిసిటీ సదుపాయం కోల్పోయారని జెలెన్స్కీ తెలిపారు. రష్యా లాంచ్ చేసిన 36 రాకెట్లలో చాలా వాటిని తాము అడ్డుకున్నామని ఆయన చెప్పారు. అయితే మిగతా రాకెట్లు లక్ష్యాలను తాకడంతో ప్రజలకు పవర్ కష్టాలు కలిగాయన్నారు. ఉక్రెయిన్పై రష్యా దాడులు సుమారు 8 నెలలుగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.