రష్యా బలగాలతో తీవ్రమైన యుద్ధం చేస్తున్న ఉక్రెయిన్లో పరిస్థితి రోజురోజుకూ దిగజారుతోంది. ఉక్రెయిన్లో సాధారణ ప్రజానీకం నివశించే చాలా ప్రాంతాలపై రష్యా వేసే బాంబుల వర్షం కురిపిస్తోంది. ఇక్కడి పరిస్థితులను ప్రపంచానికి తెలిసేలా చేసేందుకు పలు వార్తాసంస్థల జర్నలిస్టులు ప్రాణాలకు తెగించి విధులు నిర్వర్తిస్తున్నారు. ఇలా బీబీసీకి చెందిన ఉక్రెయిన్ జర్నలిస్టు ఓల్గా మాల్చెవస్కా కూడా తమ దేశంలోని పరిస్థితులను వివరిస్తోంది.
ఆమె లైవ్ ప్రోగ్రాంలో రష్యా బలగాలు ఎక్కడెక్కడ బాంబులు వేశారో వివరిస్తోంది. దానికి సంబంధించిన దృశ్యాలను చూస్తుండగా తమ ఇంటిపై కూడా బాంబులు వేసి ధ్వంసం చేశారని ఆమె గుర్తించింది. ‘‘నేనిది నమ్మలేకపోతున్నా. మేమంతా ఇక్కడే ఉండేవాళ్లం’’ అంటూ కన్నీరు పెట్టుకుంది ఓల్గా. ఇంతలో ఇంట్లో ఉండాల్సిన తల్లికి ఏమైందో అని ఆమె టెన్షన్ పడింది. సరిగ్గా అప్పుడే ఓల్గా తల్లి మెసేజ్ చేసింది.
తాను పక్కనే ఉన్న మరో బిల్డింగ్ బేస్మెంట్లో దాక్కొని ఉన్నామని తెలిపింది. దీంతో ఆమె కొంత ఊపిరి పీల్చుకుంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.