Indian on Ukraine | ఉక్రెయిన్పై రష్యా యుద్ధం నేపథ్యంలో ఇప్పటివరకు తటస్థ వైఖరి ప్రదర్శించిన భారత్ తీరు మారింది. ఉక్రెయిన్లోని బుచా పట్టణంలో పౌరుల ఊచకోత పట్ల తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. బుచాలో పౌరుల మారణ హోమంపై స్వతంత్య్ర దర్యాప్తు చేయాలన్న డిమాండ్కు భారత్ మద్దతు పలికింది. బుచా పట్టణంలో పౌరుల ఊచకోతకు పాల్పడినట్లు వచ్చిన వార్తలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఈ మారణ కాండను తీవ్రంగా ఖండిస్తున్నాం. దీనిపై స్వతంత్య్ర దర్యాప్తు చేయాలన్న డిమాండ్కు మద్దతు తెలుపుతున్నాం అని ఐరాసలో భారత రాయబారి టీఎస్ తిరుమూర్తి ఓ ప్రకటనలో తెలిపారు.
ఉక్రెయిన్పై రష్యా దండయాత్రతో తలెత్తిన హింసకు, యుద్ధానికి ముగింపు పలికేందుకు తక్షణం కాల్పుల విరమణ పాటించాలన్న పిలుపుకు కట్టుబడి ఉన్నట్లు భారత్ తెలిపింది. ఉక్రెయిన్లో పరిస్థితి దిగజారడం పట్ల భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నదని తిరుమూర్తి పేర్కొన్నారు. ఉక్రెయిన్పై రష్యా యుద్ధం ప్రభావంతో ఆహారం, ఇంధన ధరలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేకించి అభివృద్ధి చెందుతున్న దేశాలపై ప్రతికూల ప్రభావం పడుతున్నదన్నారు.
ఉక్రెయిన్లోని బుచా పట్టణంలో పౌరుల మృతదేహాలను సామూహికంగా ఖననం చేయడంపై ప్రపంచ వ్యాప్తంగా నిరసన వెల్లువెత్తుతున్నది. అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు ముందు రష్యాను నిలబెట్టాలని, రష్యాకు వ్యతిరేకంగా మరిన్ని ఆంక్షలు విధించాలన్న డిమాండ్లు పెరిగాయి.