కీవ్: ఉక్రెయిన్కు వెంటనే యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో సభ్యత్వం ఇవ్వాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు వోలోడిమిర్ జెలెన్స్కీ సోమవారం అభ్యర్థించారు. రష్యా దురాక్రమణ నేపథ్యంలో ప్రత్యేక విధానం ద్వారా ఐరోపా కూటమిలో సభ్యత్వం కల్పించాలని ఆయన కోరారు. ఈ మేరకు జెలెన్స్కీ సోమవారం ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘కొత్త ప్రత్యేక విధానం ద్వారా ఉక్రెయిన్ను తక్షణమే చేర్చుకోవాలని యూరోపియన్ యూనియన్కు మేం విజ్ఞప్తి చేస్తున్నాం. యూరోపియన్లందరితో కలిసి ఉండాలనేది మా లక్ష్యం. ముఖ్యంగా సమాన హోదా కలిగి ఉండటం. ఇది న్యాయమైనదని నేను అనుకుంటున్నాను. ఇది సాధ్యమవుతుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను’ అని అన్నారు.
మరోవైపు ఉక్రెయిన్పై రష్యా యుద్ధం సోమవారం నాటికి ఐదో రోజుకు చేరింది. అయితే ఇరు దేశాలు చర్చలకు ముందుకు వచ్చాయి. ఇరు దేశాల ప్రతినిధులు బెలారస్ సరిహద్దులో చర్చలు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో దాడులను రష్యా నిలిపివేయాలని ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ డిమాండ్ చేశారు. ఉక్రెయిన్ ఆర్మీ తీవ్రంగా ప్రతిఘటిస్తుండటంతో రష్యా దాడి తీవ్రత తగ్గిందన్నారు. అలాగే ఉక్రెయిన్ను విడిచి ప్రాణాలు దక్కించుకోవాలంటూ రష్యా సైన్యానికి ఆయన సూచించారు.