Kyiv mayor : రష్యా క్షిపణి దాడుల కారణంగా ఉక్రెయిన్లోని చాలా ప్రాంతాల్లో ప్రజలు చీకట్లో మగ్గుతున్నారు. రాజధాని కీవ్ నగరంలోని విద్యుత్ కేంద్రాల మీద రష్యా మిస్సైల్ దాడులు చేయడంతో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ‘గురువారం ఉదయం నుంచి నగరంలోని 70 శాతం భాగం చీకట్లోనే ఉందని కీవ్ మేయర్ వితాలి క్లిట్స్చుకో వెల్లడించాడు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించేందుకు ఇంజనీర్లు శాయశక్తులా ప్రయత్నిస్తున్నారు. దాదాపు సగానికి పైగా కీవ్ నగరంలో నీటి సరఫరాను మెరుగుపరిచాం’ అని వితాలి తెలిపారు.
చాలా ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు రాత్రిపూట చీకట్లోనే మగ్గుతున్నారు. విద్యుత్ ఉన్న కెఫేల దగ్గర బారులు తీరుతున్నారు. అంతేకాదు విద్యుత్ ఎప్పుడు వస్తుది? నీళ్లు ఎప్పుడు వస్తాయి? అని బంధుమిత్రులకు ఫోన్లలో మెసేజ్లు పెడుతున్నారు. యుద్ధం కారణంగా ఇప్పటికే కీవ్ నగరం చాలావరకు దెబ్బతింది. దీనికి తోడు విద్యుత్, నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 24వ తేదీన రష్యా సైన్యం ఉక్రెయిన్ మీద దాడికి దిగింది. ఈ యుద్ధంలో ఇరువైపులా లక్షల్లో సైనికులు మరణించారు. ఇప్పటికే ఉక్రెయిన్లోని నాలుగు పట్టణాల్నిరష్యా స్వాధీనం చేసుకుంది.