లండన్: చైనాలో కరోనా మహమ్మారి కోరాలు చాచడంతో ప్రపంచ దేశాలు అప్రమత్తమవుతున్నాయి. ఆ దేశానికి రాకపోకలు చేసేవారికి కరోనా టెస్టులు తప్పనిసరి చేస్తున్నాయి. ఇప్పటికే అమెరికా, భారత్, జపాన్, మలేషియాలు నెగెటివ్ సర్టిఫికెట్ ఉంటేనే తమ దేశాల్లోకి అనుమతిస్తామని ప్రకటించాయి. తాజాగా యునైటెడ్ కింగ్డమ్ (యూకే) కూడా వాటి సరసన చేరింది. చైనా నుంచి వచ్చేవారు తప్పనిసరిగా కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకోవాలని స్పష్టం చేసింది. ప్రయాణానికి రెండు రోజుల మందు ప్రీ డిపార్చర్ టెస్ట్ (పీడీటీ)ను తప్పనిసరి చేసింది. ఈ ఆంక్షలు జనవరి 5 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.
ప్రస్తుతం స్కాట్లాండ్, వేల్స్ నుంచి చైనాకు నేరుగా వెళ్లే విమాన సర్వీసులను ఇప్పటికే నిలిపివేశామని అధికారులు వెల్లడించారు. త్వరలోనే దీనిని దేశం మొత్తానికి విస్తరిస్తామని తెలిపారు. కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ వచ్చే వారం దేశ సరిహద్దులను చైనా తెరుస్తున్నదని యూకే హెల్త్ సెక్రెటరీ స్టీవ్ బార్క్లే అన్నారు. ఈ నేపథ్యంలో ముందుజాగ్రత్తగా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. ఇందులోభాగంగా చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు నెగెటివ్ రిపోర్ట్ తప్పనిసరి చేశామన్నారు.