లీవ్, మార్చి 21: క్షిపణిల వర్షం కురిపిస్తున్నా.. బాంబులు బెంబేలెత్తిస్తున్నా ఉక్రెయిన్ సైనికులు మడమ తిప్పట్లేదు. దీంతో రష్యా కొత్త వ్యూహాలకు తెరలేపింది. మరియుపోల్లో చిక్కుకొన్న వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించడానికి కారిడార్లు ఏర్పాటు చేస్తామని, దీనికి బదులుగా ఉక్రెయిన్ సేనలు ఆయుధాలు విడిచి, మరియుపోల్ను అప్పగించాలని డిమాండ్ చేసింది. రష్యా ప్రతిపాదనను ఉక్రెయిన్ తోసిపుచ్చింది. తమ నగరాలను, దేశాన్ని ఎట్టిపరిస్థితిల్లో అప్పగించబోయేది లేదని తేల్చిచెప్పింది. దీంతో పుతిన్ సేనలు మరింతగా రెచ్చిపోయాయి. సోమవారం రాత్రి మరియుపోల్పై ప్రతి 10 నిమిషాలకొకసారి బాంబుల వర్షాన్ని కురిపించాయి. అంతకుముందు కీవ్లోని ఓ షాపింగ్కాంప్లెక్స్పై రష్యా సేనలు బాంబుల వర్షం కురిపించాయి. ఈ ఘటనలో 8 మంది మరణించారు. పశ్చిమ దేశాలు పంపిన ఆయుధాలు, టర్కీ నుంచి కొనుగోలు చేసిన డ్రోన్లతో రష్యా బలగాలపై ఉక్రెయిన్ సేనలు పోరాడుతున్నాయి. ఉక్రెయిన్ మాజీ ఎంపీ కోట్విట్స్కై సతీమణి భారీ నగదుతో పారిపోవాలని యత్నించగా, హంగరీ సరిహద్దు బలగాలు అదుపులోకి తీసుకొన్నాయి. సూట్కేసులో 28 మిలియన్ డాలర్లు (రూ. 213 కోట్లు), 1.3 మిలియన్ యూరోలు (రూ. 11 కోట్లు) ఉన్నట్టు గుర్తించారు. కాగా, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్పై రష్యాలోని ఓ కోర్టు నిషేధం విధించింది. ఈ రెండు సంస్థలూ ‘అతివాదం’తో కూడినవని కోర్టు నిర్ణయం తీసుకొన్నట్టు రష్యా న్యూస్ ఏజెన్సీ టాస్ తెలిపింది.
అమ్మోనియా లీక్
సుమీ నగరానికి ఈశాన్యంలో ఉన్న నోవోసెలిట్స్యాలోని ఓ రసాయన పరిశ్రమపై రష్యా దాడి చేసింది. దీంతో పరిశ్రమలోని ప్లాంట్ నుంచి అమ్మోనియా లీక్ అవుతున్నది. ప్లాంట్కు 2.5 కిలోమీటర్ల పరిధిలో ఉన్న ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని అధికారులు హెచ్చరించారు.
పుతిన్లో నిరాశ, నిస్పృహ
పోలండ్ సరిహద్దులపై కూడా రష్యా సేనలు దాడులకు పాల్పడుతుండటంతో నాటో దేశాలు అప్రమత్తమయ్యాయి. ట్రైడెంట్ ఖండాంతర క్షిపణులకు అమర్చే దాదాపు ఆరు అణు వార్హెడ్లను ట్రక్కులపై ఉంచి ఇంగ్లండ్లోని కోల్పోర్టులో ఉన్న రాయల్నేవీ ఆయుధ డిపోకు తరలించింది. నెలరోజులు సమీపిస్తున్నా ఉక్రెయిన్ సేనలు లొంగకపోవడం, నాటో దళాలు యుద్ధం లో పాల్గొంటే పరిస్థితులు దిగజారొచ్చన్న భయాలు పుతిన్లో నిరాశ, నిస్పృహలకు కారణమవుతున్నాయని ‘డెయిలీ మెయిల్’ ఒక కథనంలో పేర్కొంది.
రష్యాలో 170% పెరిగిన కండోమ్ల కొనుగోళ్లు
రష్యాలో కండోమ్లకు డిమాండ్ పెరిగింది. పశ్చిమ దేశాలు రష్యాపై ఆర్థిక ఆంక్షలు విధిస్తున్న నేపథ్యంలో కండోమ్ల కొరత ఏర్పడుతుందనీ, ధరలు పెరుగుతాయనే అనుమానంతో ప్రజలు కొనుగోలు చేస్తున్నారని అంచనా. రిటైల్ ఆన్లైన్ కంపెనీ ‘వైల్డ్బెర్రీస్’లో మార్చిలో గతేడాదితో పోలిస్తే ఏకంగా 170 శాతం మేర కొనుగోళ్లు పెరిగాయి.