న్యూఢిల్లీ : బ్రిటన్ ప్రధాని బొరిస్ జాన్సన్ ఏప్రిల్లో భారత పర్యటన సందర్భంగా చెన్నై సందర్శిస్తారని భావిస్తున్నారు. జాన్సన్ వచ్చే నెల 26న భారత్కు రానున్నారు. జాన్సన్ చెన్నై పర్యటన ఖరారైందని, తమిళనాడులో ఆయన షెడ్యూల్పై కసరత్తు సాగుతోందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అగ్రనేత పర్యటన నేపథ్యంలో ముందస్తు ఏర్పాట్ల కోసం త్వరలోనే బ్రిటన్ నుంచి అధికారుల బృందం చెన్నై చేరుకోవచ్చని సమాచారం.
విపత్తులను ఎదుర్కొనే మౌలిక సదుపాయాలపై ఇటీవల జరిగిన అంతర్జాతీయ సదస్సులో బొరిస్ జాన్సన్ మాట్లాడుతూ పునరుత్పాదన ఇంధనం వంటి రంగాల్లో ప్రధాని నరేంద్ర మోదీ చూపుతున్న చొరవపై ప్రశంసలు గుప్పించారు. తన భారత పర్యటన సందర్భంగా అంతర్జాతీయ సమాజంతో పాటు ఇరు దేశాలకు భద్రమైన భవిష్యత్ దిశగా ప్రధాని మోదీతో తాము సంప్రదింపులు జరుపుతామని పేర్కొన్నారు. ఇక ఈ ఏడాది ఆరంభంలో బ్రిటన్ ప్రధాని భారత్లో పర్యటించాల్సి ఉండగా కొవిడ్-19 మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో ఆయన పర్యటన రద్దయింది.