లండన్: ఏడుగురు నవజాత శిశువులను (Newborn babies) చంపిన బ్రిటిష్ నర్సు (British nurse) లూసీ లెట్బీకి (Lucy Letby) న్యాయస్థానం జీవిత ఖైదు (Life Sentence) విధించనుంది. ఇప్పటికే ఆమెను దోషిగా నిర్ధారించిన లండన్ కోర్టు నేడు తీర్పు వెలువరించనుంది. ఇంగ్లాండ్లోని కౌంటెస్ ఆఫ్ చెస్టర్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తున్న లూసీ లెట్బీ 2015 జూన్ నుంచి 2016 జూన్ వరకు ఏడుగురు చిన్నారులను చంపినట్లు, మరో ఆరుగురిని చంపేందుకు ప్రయత్నించినట్లు తేలింది. ఆమెను భారత సంతతి వైద్యుడు డాక్టర్ రవి జయరామ్ ఆధారాలతో సహా పట్టించిన విషయం తెలిసిందే.
శిశు వైద్య నిఫుణుడైన డాక్టర్ రవి జయరామ్ (Ravi Jayaram) చెస్టర్ హాస్పిటల్లో వైద్యుడిగా పని చేస్తున్నారు. 2015 జూన్లో ఆ హాస్పిటల్లో ముగ్గురు నవజాత శిశివులు చనిపోయారు. ఆ తర్వాత కూడా మరో నలుగురు చిన్నారులు మరణించారు. దీంతో ఏడాది కాలంలో ఏడుగురు నవజాత శిశువులు చనిపోవడంపై డాక్టర్ రవితోపాటు మరికొందరు డాక్టర్లు.. నర్సు లూసీ లెట్బీపై అనుమానం వ్యక్తం చేశారు. అనారోగ్యంతో బాధపడుతున్న శిశువులను ఆమె చంపుతున్నదని ఆరోపించారు. హాస్పిటల్ యాజమాన్యంతోపాటు నేషనల్ హెల్త్ సర్వీసెస్ (ఎస్హెచ్ఎస్) దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లారు. కేసు నమోదుచేసిన పోలీసులు 2018 జూలైలో ఆమెను అరెస్ట్ చేశారు. 2020లో నర్సుపై అభియోగాలు నమోదుచేశారు. ఈ కేసుపై గత మూడేండ్లుగా కోర్గు విచారణ జరుపుతున్నది. శిశువుల రక్తనాళాల్లోకి సిరంజి ద్వారా గాలి, ఇన్సులిన్ను పంపించడం, అదేవిధంగా పాలు, ఇతర ద్రవాలను బలవంతంగా అధిక మోతాదులో తాగించడం వంటి క్రూర చర్యల ద్వారా శిశువులను చంపినట్లు నిరూపణ అయ్యింది.