లండన్: ఆఫ్ఘానిస్థాన్లో ఉన్న తమ పౌరులు వీలైనంత త్వరగా అక్కడి నుంచి బయటకు వచ్చేయాలని యునైటెడ్ కింగ్డమ్ (యూకే) సూచించింది. ఆఫ్ఘాన్లో నానాటికి పరిస్థితులు దిగజారుతున్న నేపథ్యంలో అక్కడున్న బ్రిటిష్ పౌరులు సాధ్యమైన త్వరగా దేశం విడిచివెళ్లాలని యూకే ఫారెన్, కామన్వెల్త్ అండ్ డెవలప్మెంట్ ఆఫీస్ (FCDO) ప్రకటించింది. దేశవ్యాప్తంగా దాడులకు పాల్పడే అవకాశం ఉందని పేర్కొన్నది. కాబూల్ పశ్చిమ ప్రాంతాల్లో రక్షణ కరువయింది, కిడ్నాప్లకు పాల్పడే అవకాశం ఉందని హెచ్చరించింది.
దేశం నుంచి అమెరికా, ఐరోపా సైన్యాలు వెనక్కి వెళ్తుండటంతో తాలిబన్లకు అడ్డేలేకుండా పోయింది. దీంతో దేశంలో ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమిస్తూ ముందుకు వెళ్తున్నారు. ఇప్పటికే 85 శాతం వరకు భూభాగాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఈ క్రమంలో దేశంలో నానాటికీ హింస తీవ్రమవుతున్నది. ఈ నేపథ్యంలో యూకే తమ పౌరులు ఆ దేశం విడిచి రావాలని సూచించింది.
ఆఫ్ఘన్ ప్రభుత్వ మీడియా విభాగ అధిపతి దవా ఖాన్ మెనాపాల్ను శుక్రవారం కాల్చిచంపారు. ఈ విషయాన్ని తాలిబన్ ప్రతినిధి జబిహుల్లా ముజాహిద్ వెల్లడించాడు. మెనాపాల్కు ‘తగిన శాస్తి’ జరిగిందని ఆయన ఓ ప్రకటనలో వ్యాఖ్యానించాడు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా, నాటో బలగాలు పూర్తిగా వైదొలిగిన తర్వాత తొలిసారిగా తాలిబన్లు నిమ్రోజ్ ప్రావిన్షియల్ రాజధాని జరాంజ్ను ఆధీనంలోకి తీసుకున్నట్టు ఆ ప్రావిన్స్ డిప్యూటీ గవర్నర్ తెలిపారు.