కంపాలా: తూర్పు ఆఫ్రికా దేశమైన ఉగాండాలో ఎబోలా వ్యాధి విజృంభిస్తున్నది. ప్రస్తుతం అక్కడ మొత్తం ఎబోలా కేసుల సంఖ్య 43కు పెరిగింది. మృతుల సంఖ్య కూడా చాపకింద నీరులా మెల్లగా పెరుగుతున్నది. ఇప్పటికే తొమ్మిది మందిని ఎబోలా వైరస్ బలితీసుకుంది. తాజాగా ఓ హెల్త్కేర్ వర్కర్ ఎబోలా బారినపడి ప్రాణాలు కోల్పోయాడు. దాంతో మొత్తం మృతుల సంఖ్య 10కి చేరింది.
ఉగాండా ఆరోగ్య మంత్రి జాన్ రూథ్ అసెంగ్ ఒసెరో మాట్లాడుతూ.. బుధవారం ఉదయం 58 ఏండ్ల అనస్థీషియన్ ఎబోలాతో మరణించాడని చెప్పారు. అనస్ఠీషియన్ మృతితో దేశంలో ఎబోలాను మహమ్మారిగా ప్రకటించినప్పటి నుంచి దాని బారినపడి మరణించిన వారి సంఖ్య 10కి చేరిందన్నారు. అందులో హెల్త్ కేర్ వర్కర్ల సంఖ్య నాలుగుకు చేరిందని చెప్పారు.
ఉగాండాలోని ముబెండే, కస్సండా, క్యెగెగ్వా, కగాడి ప్రావిన్స్లలో ఎబోలా ప్రభావం ఎక్కువగా ఉన్నది. ఎబోలా సోకిన తర్వాత 21 రోజుల వరకు లక్షణాలు బయటికి కనిపించవని ఆరోగ్య నిపుణులు తెలిపారు. లక్షణాలు బయటపడిన రోగి నుంచి మాత్రమే ఇది ఇతరులకు సంక్రమిస్తుందని చెప్పారు. ఇప్పటివరకు ఎబోలా కట్టడికి ఎలాంటి లైసెన్స్డ్ మెడికేషన్ లేదని పేర్కొన్నారు.