UAE : ఒక పక్క ప్రపంచాన్ని చమురు సంక్షోభం వేధిస్తున్న వేళ యూఏఈ సంచలన నిర్ణయం తీసుకుంది. చమురు ఉత్పత్తి దేశాల గ్రూపులైన ఒపెక్, ఒపెక్ + నుంచి వైదొలగుతున్నట్లు యూఏఈ ప్రకటించింది. ఈ నిర్ణయం మే 1 నుంచి అమలుకానున్నట్లు తెలిపింది. యూఏఈ నిర్ణయం చమురు ఉత్పత్తి దేశాలతోపాటు ప్రపంచానికి కూడా షాక్ అనే చెప్పాలి. ముఖ్యంగా ఈ కూటమికి నాయకత్వం వహిస్తున్న సౌదీ అరేబియాకు ఇది గట్టి దెబ్బ.
దీర్ఘకాలిక, వ్యూహాత్మక, ఆర్థిక అంశాల్ని దృష్టిలో పెట్టుకుని, డొమెస్టిక్ చమురు ఉత్పత్తిలో మరిన్ని పెట్టుబడుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నామని యూఏఈ ప్రకటించింది. అలాగే, చమురు ఉత్పత్తి మార్కెట్లలో బాధ్యతాయుతంగా, చిత్తశుద్దితో వ్యవహరిస్తామని ప్రకటించింది. ఒపెక్ అంటే ఆర్గనైజేషన్ ఆఫ్ ది పెట్రోలియం ఎక్స్ప్లోరింగ్ కంట్రీస్ గ్రూప్. ఈ గ్రూపులో యూఏఈ చాలాకాలంగా సభ్యదేశంగా ఉంది. దాదాపు ఆరు దశాబ్దాలుగా.. అంటే 1967 నుంచి యూఏఈ ఒపెక్లో సభ్యత్వం కలిగి ఉంది. ప్రపంచంలోని చమురు ఉత్పత్తి దేశాల్లో కీలకంగా వ్యవహరిస్తోంది. సౌదీ అరేబియా, ఇరాక్ తర్వాత మూడో అతిపెద్ద చమురు ఉత్పత్తిదారు యూఏఈ. ఒపెక్ నిర్ణయాల్లో కూడా కీలక పాత్ర పోషిస్తోంది.
అలాంటిది ఈ గ్రూపు నుంచి యూఏఈ వైదొలగడం ఈ గ్రూపునకు భారీ ఎదురుదెబ్బగానే చెప్పాలి. ఈ నిర్ణయం వల్ల ప్రపంచవ్యాప్తంగా చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. అయితే, సౌదీ అరేబియాతో ఉన్న విబేధాల కారణంగానే యూఏఈ ఈ గ్రూపు నుంచి వైదొలిగినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఇరాన్ దాడుల విషయంలో కూటమి దేశాలు సరిగ్గా స్పందించలేదనే అసంతృప్తితో యూఏఈ ఉన్నట్లు సమాచారం. ఒపెక్ గ్రూపులో చమురు ఉత్పత్తి చేసే 12 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి. ఒపెక్ + రూపులో 22–23 దేశాలున్నాయి. ఇందులో ఒపెక్లోని చమురు ఉత్పత్తి చేసే దేశాలతోపాటు రష్యా వంటి దేశాలు కూడా ఉన్నాయి.