US Fighter Jets : ఇరాన్ (Iran) తో జరుగుతున్న యుద్ధంలో అమెరికా (USA) కు వరుస దెబ్బలు తగులుతున్నాయి. ఒకేరోజు అగ్రరాజ్యానికి చెందిన రెండు యుద్ధ విమానాలను (Fighter Jets) ఇరాన్ కూల్చేసింది. మరో రెండు హెలికాప్టర్ల (Helicopters) పై కూడా దాడి జరిగింది. ఈ ఘటనల్లో ఇద్దరు పైలట్లు (Pilots) సురక్షితంగా బయటపడగా మరో పైలట్ గల్లంతయ్యాడు. అమెరికాకు చెందిన ఎఫ్-15ఈ స్ట్రైక్ (F-15E strikes) ఈగల్ విమానాన్ని ఇరాన్ శుక్రవారం దాడి చేసి కూల్చేసింది. ఇందులో ఓ పైలట్, వెపన్ సిస్టమ్ అధికారి ఉన్నారు.
ఆ ఇద్దరిలో ఒకరిని రక్షించామని, మరొకరి కోసం గాలింపు కొనసాగుతున్నదని అమెరికా, ఇజ్రాయెల్ అధికారిక వర్గాలు తెలిపాయి. అటు హర్మూజ్ సమీపంలో ఏ-10 వార్థగ్ ఫైటర్ జెట్ను ఇరాన్ కూల్చేసింది. ఆ ఫైటర్ జెట్ శకలాలు కువైట్లో పడ్డాయి. అందులోని పైలట్ సురక్షితంగా బయటపడ్డారు. ఈ రెండు ఘటనలు దాదాపు ఒకే సమయంలో జరిగినట్లు అమెరికా అధికారులు చెప్పారు. ఇరాన్ గగనతల రక్షణ సామర్థ్యాన్ని ధ్వంసం చేశామని అమెరికా, ఇజ్రాయెల్ చెబుతున్న సందర్భంగా ఈ ఘటనలు చర్చనీయాంశమయ్యాయి.
అమెరికా అంచనాలకు మించి టెహ్రాన్ గగనతల రక్షణ వ్యవస్థలు పనిచేస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. మొదటి యుద్ధ విమానంలో గల్లంతైన పైలట్ కోసం రెండు బ్లాక్హాక్ హెలికాప్టర్లు గాలింపు చేపట్టాయి. వాటిపైనా ఇరాన్ దాడి చేసినట్లు అమెరికా అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే అవి దాడి నుంచి త్రుటిలో తప్పించుకొని ఇరాన్ గగనతలం నుంచి బయటకు వచ్చేసినట్లు పేర్కొన్నాయి. ఈ ఘటనలపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్కు సమాచారం ఇచ్చినట్లు వైట్హౌస్ ప్రెస్ సెక్రటరీ కరోలిన్ లివిట్ తెలిపారు.
ఏ-10 యుద్ధ విమానం కూలిన దృశ్యాలను ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఎక్స్లో పెట్టింది. ఈ పరిణామాలపై అమెరికా ట్రంప్ స్పందించారు. ఇలాంటి ఘటనలు దౌత్య చర్చలపై ప్రభావం చూపిస్తాయా..? అని అడగ్గా.. అలా ఎప్పటికీ జరగదని, ఇది యుద్ధమని, యుద్ధంలో తాము ఉన్నామని, అలాగని ఇవి ఇరాన్తో చర్చలపై ప్రభావం చూపించవని సమాధానమిచ్చారు.