ఇస్తాంబుల్: తుర్కియే(Turkey)లో మళ్లీ భూకంపం(Earthquake) వచ్చింది. సోమవారం రాత్రి రెండు భూకంపాలు వచ్చాయి. తాజా భూకంపంలో శిథిలాల కింద చిక్కుకున్న ముగ్గురు చనిపోయినట్లు తెలుస్తోంది. సిరియా బోర్డర్ సమీపంలో ఉన్న హటాయ్ ప్రావిన్సు(Hatay Province) కేంద్రంగా రెండుసార్లు భూమి కంపించింది. తొలుత 6.4 తీవ్రతతో, ఆ తర్వాత 5.8 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు అధికారులు చెప్పారు. ఫిబ్రవరి ఆరో తేదీన వచ్చిన భూకంపంలో మరణించిన వారి సంఖ్య 45 వేలు దాటిన విషయం తెలిసిందే.
సోమవారం వచ్చిన భూకంపాల వల్ల .. బలహీనంగా ఉన్న బిల్డింగ్లు కూలిపోయాయి. తొలి భూకంపం రాత్రి 8.04 నిమిషాలకు వచ్చింది. ఆ తర్వాత మూడు నిమిషాలు మరో సారి భూమి కంపించింది. అంటకయ్యా, డెఫ్ని, సమన్డగ్ ప్రావిన్సుల్లో ముగ్గురు మరణించినట్లు మంత్రి సులేమాన్ తెలిపారు. తాజా భూకంపంలో సుమారు 213 మంది గాయపడినట్లు ఆయన చెప్పారు.