హతాయ్: భారీ భూకంపంతో మరుభూమిగా మారిన టర్కీ, సిరియా భూభాగాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. శిథిలాలను తొలగించినాకొద్ది మృతదేహాలు బయటపడుతూనే ఉన్నాయి. దాంతో ఇప్పటికే మృతుల సంఖ్య 28 వేలు దాటింది. ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే శిథిలాల తొలగింపు ఇప్పుడప్పుడే పూర్తయ్యేలా లేదు. శిథిలాల తొలగింపు ముగిసేదాక మృతుల సంఖ్య పెరుగుతూనే ఉండే అవకాశం ఉంటుంది.
ఇదిలావుంటే, శిథిలాల కింద మృతదేహాలతోపాటే కొందరు ప్రాణాలతో కూడా బయటపడుతున్నారు. భూకంపం సంభవించి ఐదు రోజులు అవుతున్నా, తిండి, నీళ్లు లేకపోయినా కొంతమంది ప్రాణాలతో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే తాజాగా రెండు నెలల పసికందు శిథిలాల కింద ప్రాణాలతో దొరికింది. దాదాపు 128 గంటలు ఆ పసిబిడ్డ శిథిలాల కిందే ఉండిపోయింది. టర్కీలోని హతాయ్ పట్టణంలో ఈ ఆశ్చర్యకర ఘటన చోటుచేసుకుంది.
శనివారం శిథిలాల కింద నుంచి బయటపడిన వారిలో రెండు నెలల పసిబిడ్డతోపాటే భూకంపం సంభవించిన వేర్వేరు ప్రాంతాల నుంచి ఓ రెండేళ్ల బాలిక, ఆరు నెలల గర్భంతో ఉన్న మహిళ, 70 ఏండ్ల వృద్ధురాలు కూడా ఉన్నారు. ఈ నెల 7న టర్కీ-సిరియా సరిహద్దుల్లో 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపం మృతుల సంఖ్య.. 2003లో ఇరాన్ భూకంప మృతుల సంఖ్యకు చేరువైంది. ఇరాన్ భూకంపంలో 31 వేల మంది ప్రాణాలు కోల్పోయారు.