ఇస్లామాబాద్: పాకిస్థాన్లో ఇద్దరు సిక్కులను గుర్తు తెలియని దుండగులు తుపాకులతో కాల్చి చంపారు. ఖైబర్ పఖ్తుంక్వా ప్రావిన్స్ పెషావర్లోని సర్బంద్ ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన జరిగింది. బాటా తాల్ మార్కెట్లో సుగంధ ద్రవ్యాల షాపులు నిర్వహించే వ్యాపారులైన 42 ఏళ్ల సల్జిత్ సింగ్, 38 ఏళ్ల రంజిత్ సింగ్పై కొందరు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో వారు అక్కడికక్కడే మరణించారు. సమాచారం అందుకున్న పాకిస్థాన్ పోలీసులు వెంటనే ఆ ప్రాంతానికి చేరుకున్నారు. ఖైబర్ పఖ్తుంక్వా ముఖ్యమంత్రి మహమూద్ ఖాన్ ఈ ఘటనను ఖండించారు. మత సామరస్యానికి విఘాతం కలిగించే కుట్ర అని అన్నారు. నిందితులను అరెస్ట్ చేయాలని పోలీసులను ఆదేశించారు.
మరోవైపు పాకిస్థాన్లోని పెషావర్ ప్రాంతంలో ఇద్దరు సిక్కులపై కాల్పులు జరిపి చంపడాన్ని పంజాబ్కు చెందిన శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ ఖండించారు. ఈ ఘటనపై విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలని కేంద్ర విదేశాంగ మంత్రి జై శంకర్ను కోరారు. పాకిస్థాన్లోని సిక్కుల రక్షణ అంశంపై ఆ దేశ ప్రధాని కార్యాలయంతో మాట్లాడాలని సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ట్వీట్ చేశారు.
Shocked & pained to learn about the dastardly killing of two Sikh shopkeepers -Ranjit Singh & Kuljeet Singh in Peshawar (Pakistan). Condemning the incident, I urge EAM @DrSJaishankar ji to ensure justice to the bereaved families & also to take up Sikhs' safety issue with @PakPMO. pic.twitter.com/pwMQtMhsJO
— Sukhbir Singh Badal (@officeofssbadal) May 15, 2022