Indians Killed : ఇటలీ, బెర్గామోలోని కోవోలో ఇద్దరు భారతీయులు హత్యకు గురయ్యారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి పట్టణంలోని ఇండస్ట్రియల్ ఏరియాలో ఉన్న గురుద్వారా మాతా సాహిబ్ కౌర్ జీ వద్ద జరిగింది. ఇదో వేర్హౌజ్. అయితే, ఇక్కడ కూడా ప్రార్థనలు నిర్వహిస్తారు. శుక్రవారం వైశాఖి ఫెస్టివల్ సందర్భంగా అందరూ ఉన్న సమయంలోనే ఈ హత్య ఘటన జరిగింది.
స్థానికులు, అక్కడి మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. రాగిందర్ సింగ్ (48), గుర్మిత్ సింగ్ (48) అనే ఇద్దరు వ్యక్తులు శుక్రవారం రాత్రి గురుద్వారా నుంచి బయటకు వస్తుండగా ఆయుధాలతో వచ్చిన దుండగుడు ఇద్దరిపై సమీపం నుంచి కాల్పులు జరిపారు. ఈ ఘటనలో రాగిందర్, గుర్మిత్ సింగ్ అక్కడికక్కడే మరణించారు. అనంతరం దుండగుడు కారులో అక్కడి నుంచి పరారయ్యాడు. అయితే, హత్యకు పాల్పడింది కూడా ఇండియనే అని ప్రాథమికంగా తెలుస్తోంది. వీరి మధ్య ఉన్న ఏవో కలహాలు, కక్షల కారణంగా ఈ హత్య జరిగి ఉండొచ్చని భావిస్తున్నారు. అలాగే, ముందస్తు ప్రణాళిక ప్రకారమే ఈ హత్య జరిగిందని స్థానికులు అంటున్నారు.
నిందితుడు కూడా ఇంతకుముందు ఈ గురుద్వారాకు వచ్చేవాడని అక్కడివారు చెబుతున్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. నిందితుడు అనేక రౌండ్ల కాల్పులు జరిపాడు. ఘటన జరిగిన ప్రదేశం నుంచి పోలీసులు పది షెల్స్ స్వాధీనం చేసుకున్నారు. ఈ కాల్పుల్లో మరొకరికి కూడా బుల్లెట్లు తగిలినట్లు తెలుస్తోంది.