శాన్ఫ్రాన్సిస్కో: సరిగ్గా వారం క్రితం ట్విట్టర్ను సొంతంచేసుకున్న టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ అన్నంతపనీ చేశాడు. కంపెనీలో సుమారు 50 శాతం మంది ఉద్యోగులపై వేటువేశాడు. ఇకపై వారంతా వీధులకు హాజరుకావాల్సిన అవసరం లేదని మేయిల్స్ పంపించారు. ఉద్యోగాల కోత ప్రక్రియ పూర్తయ్యేవరకు ట్విట్టర్ ఆఫీసులను మూసే ఉంచాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. సామాజిక మాధ్యమాన్ని మస్క్ తన ఆధీనంలోకి తీసుకున్న మరుక్షణం నుంచే ఉద్యోగుల తొలగింపు ప్రారంభమైంది. కంపెనీ సీఈవో పరాగ్ అగర్వాల్, ఫైనాన్స్ చీఫ్ నెడ్ సెగల్, లీగల్ హెడ్ విజయ గద్దెపై వేటుతో మొదలైన ఈ ప్రక్రియ ఉద్యోగుల వరకు వచ్చింది.
కంపెనీలో మొత్తం 7500 మంది ఉద్యోగులు ఉన్నారు. అందులో సుమారు 50 శాతం మంది అంటే 3700 మందికిపైగా ఉద్యోగులను తొలగించారని ఏఎఫ్పీ నివేదికలు వెల్లడించాయి. వారందరికీ శుక్రవారమే ఈ మెయిల్స్ పంపినట్టు పేర్కొన్నాయి. కాగా, ఇప్పటికే భారత్లో ఉన్న 200 మందికిపైగా ఉద్యోగుల్లో మెజారిటీ ఉద్యోగులకు గుడ్ బై చెప్పారు. మార్కెటింగ్, కమ్యూనికేషన్స్ విభాగాలను పూర్తిగా తొలగించిన మస్క్.. ఇంజినీరింగ్, సేల్స్ విభాగాల్లోనూ ఉద్యోగులను తొలగించారు. కంపెనీ ఆరోగ్యాన్ని మెరుగుపర్చేందుకు కోత తప్పడం లేదని మస్క్ తన సందేశంలో పేర్కొన్నారు.