అష్గాబాట్, జనవరి 9: తుర్కమెనిస్థాన్లో 50 ఏండ్లుగా మండుతున్న ‘గేట్వే టు హెల్'(దర్వాజా చమురు లోయ) మంటలను ఆర్పేందుకు ఉపాయాలను వెతకాలని ఆ దేశ అధ్యక్షుడు గుర్బాంగులీ బెర్దీముఖమ్మదోవ్ అధికారులను శనివారం ఆదేశించారు. ఈ లోయ మండుతూనే ఉండటం వల్ల పర్యావరణానికే కాక దేశానికి ఆర్థికంగా కూడా నష్టం సంభవిస్తున్నదని పేర్కొన్నారు. ఎంతో విలువైన సహజ వనరులను కోల్పోతున్నామని ఆందోళన వ్యక్తం చేశారు. దార్వాజా చమురులోయ కారకుమ్ ఎడారి మధ్యలో ఉంది. 1971లో అక్కడ తవ్వకాలు జరుపుతున్న సమయంలో పొరపాటున చమురు, సహజవాయువు ఉన్న గుహలోకి డ్రిల్లింగ్ జరిగింది. సహజవాయువు ఎగిసింది. అది బయటకు వ్యాపించకుండా అదుపు చేయడానికి నిప్పు పెట్టారు. అప్పటి నుంచి లోయ మండుతూనే ఉంది.