అంకారా: తుర్కియే, సిరియా సరిహద్దుల్లో సోమవారం తెల్లవారుజామున సంభవించిన భారీ భూకంపం వల్ల శిథిలాల్లో చిక్కుకున్న ఒక యువకుడు తన మూత్రం తాగి నాలుగు రోజులపాటు బతికాడు. చివరకు అతడ్ని గుర్తించిన రెస్క్యూ బృంద సభ్యులు సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. తుర్కియే, సిరియా సరిహద్దుల్లో సంభవించిన భారీ భూకంపం ఆ రెండు దేశాలను అతలాకుతలం చేసింది. ఈ ఘోర ప్రకృతి విపత్తులో సుమారు 25 వేల మందికిపైగా ప్రజలు మృత్యువాత పడ్డారు. శిథిలాల కింద వేలాది మంది చిక్కుకుపోవడంతో మృతుల సంఖ్య మరింతగా పెరుగుతున్నది.
కాగా, శిథిలాల కింద చిక్కుకున్న వారిని సురక్షితంగా బయటకు తీసేందుకు సహాయక బృందాలు నిరంతరం శ్రమిస్తున్నాయి. దీంతో మృత్యువుతో పోరాడి ప్రాణాలతో ఉన్న పలువురు శిథిలాల నుంచి బయటపడుతున్నారు. 17 ఏళ్ల అద్నాన్ ముహమ్మత్ కోర్కుట్, తుర్కియేలోని గజియాన్టెప్ నగరంలో తన ఇంటి శిథిలాల్లో 94 గంటలపాటు చిక్కుకుపోయాడు. భూకంపం సంభవించినప్పుడు ఆ ఇంట్లో నిద్రిస్తున్న అతడు అనంతరం శిథిలాల మధ్య ఉండిపోయాడు.
మరోవైపు సహాయం కోసం అద్నాన్ కేకలు వేయడంతో సుమారు నాలుగు రోజుల తర్వాత గుర్తించిన రెస్క్యూ బృందాలు అతడ్ని సురక్షితంగా బయటకు తీశారు. అయితే ఈ నాలుగు రోజులపాటు తన మూత్రాన్ని తాగటంతోపాటు మొక్కల పూలు తిని ప్రాణాలు కాపాడుకున్నట్లు ఆ యువకుడు తెలిపాడు. అతడ్ని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.