ఇస్లాంబుల్: తుర్కియే భూకంప(Turkey Earthquake) శిథిలాల కింద చిక్కుకున్న ఓ వ్యక్తిని గుర్తించారు. సుమారు 278 గంటల తర్వాత.. అంటే దాదాపు 12 రోజుల తర్వాత కూడా ఓ వ్యక్తి శిథిలాల కింద సజీంగా ఉన్నాడు. 45 ఏళ్ల ఆ వ్యక్తి పేరు హకన్ యాసింగ్లో. భూకంప ప్రాంతాల్లో ఇంకా రెస్క్యూ ఆపరేషన్(Rescue Operation) కొనసాగుతోంది. తుర్కియే భూకంపంలో ఇప్పటి వరకు మరణించిన వారి సంఖ్య 41 వేలు దాటింది.
278. saat mucizesi!
Hatay'da 278 saat sonra Hakan Yasinoğlu sağ olarak kurtarıldı. pic.twitter.com/O8excnDmi9
— Ekrem İmamoğlu (@ekrem_imamoglu) February 17, 2023
గత వారం రోజుల నుంచి శిథిలాల తొలగింపు జరుగుతోంది. సిరియా బోర్డర్ సమీపంలో 7.8 తీవ్రతతో భారీ భూకంపం వచ్చిన విషయం తెలిసిందే. దీంతో హటాయ్ ప్రాంతంలో భారీ సంఖ్యలో బిల్డింగ్లు నేలమట్టం అయ్యాయి. ఆ కాంక్రీట్ శిథిలాల కింద వేలాది మంది చిక్కుకున్నారు. ఇప్పటి వరకు అనేక మందిని రక్షించారు.
సమాంతరంగా నేలమట్టం అయిన బిల్డింగ్ నుంచి శుక్రవారం ఓ వ్యక్తిని కాపాడారు. అతన్ని స్ట్రెచర్పై రెస్క్యూ టీం తీసుకువెళ్లింది. ప్రస్తుతం తుర్కియేలో శీతల వాతావరణం నెలకొన్న నేపథ్యంలో సహాయక చర్యలు అతికష్టంగా సాగుతున్నాయి. శిథిలాల నుంచి రక్షించిన ఆ వ్యక్తికి థర్మల్ జాకెట్ తొడిగారు. ఆ తర్వాత అంబులెన్స్ ద్వారా ఆస్పత్రికి తరలించారు.
సుమారు 200 ప్రాంతాల్లో రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతున్నట్లు తుర్కియే ఉపాధ్యక్షుడు ఫువాట్ ఓకటే తెలిపారు. గురువారం కూడా ముగ్గుర్ని రక్షించారు. దాంట్లో 14 ఏళ్ల పిల్లోడు కూడా ఉన్నాడు. భూకంపం వల్ల 11 ప్రావిన్సుల్లో నష్టం కలగా.. దాంట్లో ఆదనా, కిలిస్, సనిలుర్ఫా ప్రావిన్సుల్లో రెస్క్యూ ఆపరేషన్ ముగిసినట్లు తుర్కియే అధికారులు తెలిపారు.