Donald Trump : అమెరికా-ఇరాన్ (US-Iran) దేశాల మధ్య ఉద్రిక్తతలు మరోసారి పతాకస్థాయికి చేరాయి. ఇరాన్పై ఈ రాత్రే భారీస్థాయిలో దాడులు చేస్తామని అమెరికా అధ్యక్షుడు (US President) డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) సంచలన ప్రకటన చేశారు. ఇరాన్కు చెందిన కీలక చమురు క్షేత్రాలను, ముఖ్యంగా ఖర్గ్ ద్వీపాన్ని (Kharg Island) తమ ఆధీనంలోకి తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. గురువారం తన ట్రూత్ సోషల్ (Truth Social) ఖాతా ద్వారా ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు.
‘ఈ రాత్రే అమెరికా బలగాలు ఇరాన్పై అత్యంత తీవ్రమైన దాడులు చేయనున్నాయి. త్వరలోనే ఖర్గ్ ద్వీపంతోపాటు ఇతర చమురు మౌలిక సదుపాయాల కేంద్రాలను స్వాధీనం చేసుకుంటాం. వారి చమురు, గ్యాస్ మార్కెట్లపై పూర్తి నియంత్రణ సాధిస్తాం’ అని ఆయన తన పోస్టులో పేర్కొన్నారు. ఇప్పటికే ఇరుదేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. ఇటీవల ఇరాన్కు చెందిన గగనతల రక్షణ, నిఘా వ్యవస్థలపై అమెరికా దాడులు నిర్వహించింది. మరోవైపు తమ అపాచీ హెలికాప్టర్ను ఇరాన్ కూల్చివేసిందని అమెరికా ఆరోపిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్ చేసిన తాజా హెచ్చరికలు అంతర్జాతీయంగా అత్యంత ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
పర్షియన్ గల్ఫ్లో ఉన్న ఖర్గ్ ద్వీపం ఇరాన్ చమురు ఎగుమతులకు ప్రధాన కేంద్రం. ఆ దేశం నుంచి జరిగే ముడి చమురు ఎగుమతుల్లో సుమారు 90 శాతం ఇక్కడి నుంచే సాగుతాయి. ఈ ద్వీపాన్ని స్వాధీనం చేసుకుంటామని ట్రంప్ ప్రకటించడం ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. సైనిక చర్యల హెచ్చరికలు కొనసాగుతున్నప్పటికీ, ఇరు దేశాల మధ్య దౌత్యపరమైన చర్చలు కూడా జరుగుతున్నాయని, అయితే అవి మందకొడిగా సాగుతున్నాయని తెలుస్తున్నది.