వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్(Donald Trump) తన ప్రసంగంలో గత ఏడాది హత్యకు గురైన కన్జర్వేటివ్ నేత ఛార్లీ కిర్క్ గురించి ప్రస్తావించారు. క్యాపిటల్ హిల్లో జరిగిన కార్యక్రమంలో ఉభయసభలను ఉద్దేశించి ట్రంప్ ఇవాళ ప్రసంగించారు. తన ప్రసంగంలో ఛార్లీ కిర్క్ భార్య ఎరికా కిర్క్ సేవలను ప్రశంసించారు. ఛార్లీ కిర్క్ ఓ గొప్ప వ్యక్తి అని, అమెరికాలో దైవం పట్ల విశ్వాసాన్ని పెంపొందించడంలో ఛార్లీ ఎంతో పాత్ర పోషించినట్లు ట్రంప్ తెలిపారు. అమెరికాలో తాను అధికారంలో ఉన్న సమయంలో.. మతం, విశ్వాసాలు, క్రైస్తవం, దైవంపై నమ్మకం పెరిగినట్లు చెప్పారు. చాలా తీవ్రమైన స్థాయిలో మత పునరుద్దరణ జరిగినట్లు వెల్లడించారు. యువతలో ఆ ఆసక్తి కనిపించిందని, తన మిత్రుడు ఛార్లీ కిర్క్ ఆ ఉద్యమాన్ని తీసుకువచ్చినట్లు ట్రంప్ చెప్పారు.
చాలా క్రూరమైన రీతిలో ఛార్లీని గత ఏడాది హత్య చేశారని, అతని విశ్వాసాలను దెబ్బతీసే ప్రయత్నం చేసినట్లు ట్రంప్ పేర్కొన్నారు. దైవం సన్నిధిలో అమెరికా అంతా ఒక్కటే అన్న నినాదాన్ని వినిపించాలని, మనం అందరం ఒక్క దగ్గరికి రావాలని, ఎటువంటి రాజకీయ హింసనైనా పూర్తిగా తిరస్కరించాలని ట్రంప్ తన ప్రసంగంలో తెలిపారు. మన దేశం మతాన్ని ప్రేమిస్తుందని, ఆ పునరుద్దరణ ప్రక్రియను కూడా ప్రేమిస్తామని, ఎవరూ ఊహించనిరీతిలో ఆ పునరుద్దరణ జరుగుతోందని, ఇది నిజంగా చాలా అందమైన అంశమని ట్రంప్ అన్నారు.