వాషింగ్టన్: అమెరికా మాజీ అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మరోసారి తనదైన స్టైల్లో సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్ను బాక్సింగ్ రింగ్లో ఈజీగా, సెకండ్లలో ఒడిస్తానని అన్నారు. త్వరలో ప్రారంభం కానున్న బాక్సింగ్ మ్యాచ్ నేపథ్యంలో ఒక జర్నలిస్ట్ ఫోన్లో ట్రంప్తో మాట్లాడారు. బాక్సింగ్లో ఎవరితో పోటీపడాలని ఆయన భావిస్తున్నారని అడిగారు. ట్రంప్ దీనికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ‘నేను ప్రపంచంలో ఎవరినైనా ఎంపిక చేసుకోవాల్సి వస్తే, కేవలం ప్రొఫెషనల్ బాక్సర్తో మాత్రమే కాదు, జో బైడెన్పై కూడా తలపడతాను. బహుశా నేను బైడెన్పై సులువుగా పోరాడుతానని అనుకుంటున్నా. ఎందుకంటే ఆయన చాలా చాలా త్వరగా డౌన్ అవుతారని భావిస్తున్నా. ఆయన చాలా పెద్ద ఇబ్బందుల్లో ఉన్నారు. మొదటి కొన్ని సెకండ్లలో బైడెన్ ఓడిపోతారని అనుకుంటున్నా’ అని ట్రంప్ అన్నారు.
వరల్డ్ ట్రేడ్ సెంటర్ ట్విన్ టవర్లపై ఉగ్ర దాడి జరిగి శనివారానికి 20 ఏండ్లు కావడం, ఆఫ్ఘనిస్థాన్ నుంచి అమెరికా బలగాలను ఉన్నపళంగా ఉపసంహరించి బైడెన్ విమర్శలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకున్నది.
మరోవైపు ట్రంప్ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. నెటిజన్లు పలు రకాలుగా స్పందించారు. ట్రంప్, బైడెన్ మధ్య బాక్సింగ్ మ్యాచ్ను ప్రత్యక్షంగా చూసేందుకు తన మామ రిఫ్రిజిరేటర్ను అమ్ముతానంటూ ఒకరు చమత్కరించారు. అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్ను ట్రంప్ ఓడించలేకపోయారని ఒకరు విమర్శించారు.