వాషింగ్టన్: కార్ల లోడ్తో ఉన్న ఒక లారీని రైలు వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంపై ఉన్న కార్లు గాల్లోకి ఎగిరి పడ్డాయి. అమెరికా ఓక్లహోమాలోని థాకర్విల్లేలో గత శుక్రవారం ఈ ఘటన జరిగింది. కారుల లోడ్తో ఉన్న ఒక వాహనం రైల్వే ట్రాక్ మధ్యలో చిక్కుకున్నది. అధిక బరువు వల్ల ట్రాక్ అవతలకు వెళ్లలేక రైలు పట్టాల మధ్యలోనే అది నిలిచిపోయింది. ఇంతలో అమ్ట్రాక్ రైలు వేగంగా రావడాన్ని గమనించిన డ్రైవర్ లారీ నుంచి దిగి వెళ్లాడు. అంతలోనే ఆ రైలు లారీని బలంగా ఢీకొట్టింది. దీంతో ఆ వాహనంపై ఉన్న కారులు గాల్లోకి ఎగిరాయి.
కాగా, ఈ ఘటనలో ఆ రైలులో ప్రయాణిస్తున్న ఐదుగురు గాయపడగా, వారిని ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు తెలిపారు. రైలుతో పాటు రైలు పట్టాలు డేమేజ్ అయినట్లు చెప్పారు. మరోవైపు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. లారీ డ్రైవర్ పట్ల కొందరు సానుభూతి వ్యక్తం చేశారు. అతడికి ఏమీ కాకపోవడంతో ఊరట చెందారు.