వాషింగ్టన్: జీపీఎస్ ఆధారంగా కారు డ్రైవ్ చేసిన పర్యాటకులు ఏకంగా దానిని సముద్రంలోకి నడిపారు (Car Drives Into Sea). గమనించిన బోటు సిబ్బంది సముద్రంలోకి దూకి వారిని కాపాడారు. పసిఫిక్ మహాసముద్రం తీరంలో ఉన్న అమెరికాలోని హవాయిలో ఈ సంఘటన జరిగింది. ఒక కుటుంబం సందర్శన కోసం హవాయికి వచ్చింది. వెంట తెచ్చుకున్న బోటులో స్నేహితులతో కలిసి సముద్రంలో విహరించారు. అనంతరం అక్కాచెల్లెళ్లైన ఇద్దరు మహిళలు ఒక కారులో ప్రయాణించారు. కైలువా-కోనాలోని హార్బర్ వద్ద ఒక టూర్ కంపెనీ కార్యాలయానికి వెళ్లేందుకు ప్రయత్నించారు.
కాగా, ఒక మహిళ జీపీఎస్ సహాయంతో కారును డ్రైవ్ చేసింది. అయితే ఆ కారును నేరుగా సముద్రంలోకి నడిపింది. అక్కడ ఉన్న బోటు సిబ్బంది దీనిని గమనించారు. వెంటనే సముద్రంలోకి దూకారు. కారులో ఉన్న ఇద్దరు మహిళలను రక్షించారు. సముద్ర తీరం వద్ద బోటులో ఉన్న ఒక మహిళ భర్త కూడా రెస్క్యూ కోసం శ్రమించాడు. వారిని కాపాడిన కొంత సేపటికి ఆ కారు సముద్రపు నీటిలో పూర్తిగా మునిగిపోయింది. ఆ తర్వాత మరో కారు సహాయంతో తాళ్ల ద్వారా దానిని సముద్రం నుంచి బయటకు తీశారు.
మరోవైపు ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ సంఘటనపై నెటిజన్లు భిన్నంగా స్పందించారు. ఇది ఎలా జరిగిందంటూ కొందరు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. కారు నడిపిన మహిళ ఏ జీపీఎస్ను ఫాలో అయ్యిందని ఒకరు ప్రశ్నించారు. జీపీఎస్ను గుడ్డిగా అనుసరించకూడదని మరొకరు సూచించారు. ఆ సమయంలో వర్షం కురుస్తున్నదని, దీంతో వారు తప్పుగా టర్న్ తీసుకుని ఉంటారని ఒకరు పేర్కొన్నారు. అయితే కారులో ఉన్న ఇద్దరు మహిళలు చాలా ధైర్యంగా ఉండటంతోపాటు వారు సురక్షితంగా ప్రమాదం నుంచి బయటపడటాన్ని కొందరు అభినందించారు.