ఢాకా, అక్టోబర్ 21: ‘ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను..’ అంటూ ‘ఆలుమగలు’ చిత్రంలో నటసామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు కోసం గాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రమణ్యం ఆలపించిన గీతం బంగ్లాదేశ్లో ఓ దొంగ (40)కు సరిగ్గా సరిపోయింది. గురువారం రాత్రి బరిషాల్ జిల్లా బందర్ ఏరియాలోని ఓ సరుకుల దుకాణంలో చోరీకి పాల్పడిన ఆ దొంగ.. అక్కడి నుంచి బయటపడదామనుకొనేసరికే తెల్లారిపోయింది.
దీంతో అప్పటికే ఆ దుకాణం వెలుపల గుమిగూడిన జనం తనను చితక్కొడతారన్న భయం తో సాయం కోసం నేషనల్ హెల్ప్లైన్ నంబర్ 999 ద్వారా ఏకంగా పోలీసులనే ఆశ్రయించాడు. తన పరిస్థితిని వివరించి, సురక్షితంగా బయటపడేందుకు సాయం చేయమని కోరడంతో స్థానిక పోలీసులు వెంటనే రంగంలోకి దిగారు. శుక్రవారం ఉదయం ఆ దుకాణాన్ని తెరిచేందుకు వచ్చిన యజమానిని కొద్దిసేపు బయటే నిలిపివేసి లోపలికి వెళ్లిన పోలీసులు.. ఆ దొంగను పట్టుకొని బయటకు వచ్చారు. చోరీకి యత్నించాడన్న అభియోగాలతో అతడని అరెస్టు చేశారు. కాగా, నేరం చేసిన తర్వాత ఓ దొంగ పోలీసులకు కాల్ చేయడం తన సర్వీస్లో ఇదే తొలిసారని బందర్ పోలీస్ స్టేషన్ చీఫ్ అసదుజ్ జమన్ విలేకర్లకు తెలిపారు.