కాబూల్: ఆఫ్ఘనిస్థాన్( Afghanistan )లో తాలిబన్ల ఆధీనంలో ఉన్న ప్రాంతంలో పని చేస్తున్న ముగ్గురు భారత ఇంజినీర్లను రక్షించినట్లు ఇండియన్ ఎంబసీ వెల్లడించింది. ఓ డ్యామ్ నిర్మాణ ప్రాంతంలో పని చేస్తున్న వీరిని విమానంలో సురక్షిత ప్రాంతానికి తీసుకొచ్చినట్లు చెప్పింది. ఆఫ్ఘనిస్థాన్లో భారతీయులకు ముప్పు పొంచి ఉన్న వేళ తమ ఆదేశాలను అందరూ కచ్చితంగా పాటించాలని మరోసారి ఇండియన్ ఎంబసీ కోరింది. అంతేకాదు వెంటనే తిరిగి స్వదేశానికి వెళ్లిపోవడానికి ప్రయాణ ఏర్పాట్లు చేసుకోవాలని సూచించింది.
ఇక ఆఫ్ఘనిస్థాన్లోని పరిణామాలను ఎప్పటికప్పుడు అందిస్తున్న భారత జర్నలిస్టులందరూ అదనపు రక్షణ చర్యలు తీసుకోవాలని చెప్పింది. ఆఫ్ఘనిస్థాన్లో తాలిబన్లు మెల్లగా దేశమంతా విస్తరిస్తున్నారు. ఇప్పటికే ఆ దేశంలోని రెండో అతి పెద్ద నగరమైన కాందహార్తోపాటు పలు ఇతర నగరాలను కూడా తమ ఆధీనంలోకి తీసుకున్న విషయం తెలిసిందే.