సింగపూర్: సింగపూర్లో గత నెల రోజులుగా కొత్తగా నమోదైన కరోనా కేసుల్లో వ్యాక్సిన్ తీసుకున్న వారు మూడొంతుల మంది ఉన్నారు. గత 28 రోజుల్లో కొత్తగా 1,096 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో 484 మంది (44 శాతం) టీకా రెండు డోసులు తీసుకున్నవారు కాగా, 30 శాతం కేసులు ఒక డోసు టీకా, 25 శాతం టీకా తీసుకోని కేసులు ఉన్నట్లు ప్రభుత్వం తెలిపింది. అయితే మొత్తం మీద ఆక్సిజన్ సపోర్ట్ ఉన్న సీరియస్ కేసులు ఏడు మాత్రమేనని, ఇందులో ఆరుగురు కరోనా టీకా తీసుకోనివారు కాగా ఒకరు ఒక డోసు టీకా తీసుకున్న వ్యక్తి అని పేర్కొంది.
మొత్తానికి పూర్తిగా కరోనా టీకా తీసుకున్న వారికి మళ్లీ వైరస్ సోకినా ఎలాంటి లక్షణాలు లేకపోవడం లేదా స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నట్లు సింగపూర్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇందులో కూడా తక్కువ వయసు వారి కంటే 61 ఏండ్లు పైబడిన కేసులు 88 శాతం మేర ఉన్నట్లు వివరించింది. దీంతో టీకా వేసుకున్నవారికి కరోనా వల్ల ఎలాంటి ప్రాణనష్టం ఉండదని మరోసారి నిరూపితమైందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సింగపూర్ ప్రభుత్వం టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేసింది. కరోనా వ్యాక్సినేషన్ పరంగా యూఏఈ తర్వాత సింగపూర్ రెండోస్థానంలో ఉన్నది. ఆ దేశంలోని 57 లక్షల జనాభాలో సుమారు 75 శాతం మంది కరోనా టీకా పొందారు.