Peshawar mosque blast | పాకిస్థాన్లోని పెషావర్లో గల ఓ మసీదులో ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. భద్రతా సిబ్బందే లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో ఇప్పటి వరకు వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో ఎక్కువగా పోలీసు సిబ్బందే ఉన్నారు. కాగా, మసీదులో పేలుడు జరిగిన సమయంలో అక్కడ 400 మంది పోలీసులు గస్తీలో ఉన్నారు. అయినప్పటికీ ఈ పేలుడు జరగడం తీవ్ర చర్చనీయాంసమైంది. ఇంత హైసెక్యూరిటీని దాటుకుని సూసైడ్ బాంబర్ మసీదులోకి ఎలా చొరబడ్డారన్నది ప్రశ్నార్థకంగా మారింది.
అయితే, సదరు సూసైడ్ బాంబర్ పోలీసు డ్రెస్లో తలకు హెల్మెట్ పెట్టుకుని మసీదులోకి చొరబడ్డట్లు అక్కడి అధికారులు తాజాగా వెల్లడించారు. ‘భద్రతా లోపం కారణంగా ఈ దాడి జరిగింది. సూసైడ్ బాంబర్ పోలీసు డ్రెస్ వేసుకుని ఉండటంతో సెక్యూరిటీ చెక్ వద్ద డ్యూటీలో ఉన్న వారు అతన్ని సరిగా చెక్ చెయ్యలేదు..’ అని ఖైబర్ ఫక్తుంఖ్వా ప్రావిన్స్ పోలీసు అధికారి మొజామ్ జా అన్సారీ తెలిపారు. అతను పోలీసు డ్రెస్లో లోపలికి చొరబడినట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా వెల్లడైనట్లు చెప్పారు. మరోవైపు ఘటనాస్థలి వద్ద సూసైడ్ బాంబర్ తలను ఇప్పటికే పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
పెషావర్ నగరంలోగల హై సెక్యూరిటీ జోన్లో ఓ మసీదులో సోమవారం మధ్యాహ్నం ప్రార్థనలు జరుగుతున్న సమయంలో ఈ పేలుడు సంభవించింది. భద్రతా సిబ్బందే లక్ష్యంగా ఈ దాడి జరిగినట్లు పోలీసులు ఇప్పటికే వెల్లడించారు. మసీదులో పేలుడు జరిగిన సమయంలో ఆ ప్రాంతంలో దాదాపు 400 మంది పోలీసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. మృతిచెందిన 101 మందిలో 97 మందికి పైగా పోలీసులే ఉన్నారు. ఈ ఘటనలో 150 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. వారంతా సమీపంలోని పలు ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు.