పారిస్: ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రన్ వార్నింగ్ ఇచ్చారు. రష్యా, ఉక్రెయిన్ మధ్య జరుగుతున్న యుద్ధం ఇప్పట్లో ముగియదన్నారు. చాలా సుదీర్ఘమైన యుద్ధాన్ని ఎదుర్కొనేందుకు ప్రపంచ దేశాలు సిద్ధంగా ఉండాలన్నారు. ఆ దేశ వార్షిక వ్యవసాయ సదస్సులో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ఒక విషయాన్ని చెప్పదలుచుకున్నానని, ఈ యుద్ధం ఇప్పట్లో ముగియదని అన్నారు. ఈ సంక్షోభం చాలా రోజులు ఉంటుందని, ఈ యుద్ధం చాన్నాళ్లు కొనసాగుతుందని, దానితో వచ్చే సంక్షోభ పర్యవసానాలను ఎదుర్కొనేందుకు మనమంతా సిద్ధంగా ఉండాలని మాక్రన్ హెచ్చరించారు. నాటోలో కీలక దేశమైన ఫ్రాన్స్ ఇవాళ ఉక్రెయిన్కు ఆయుధాలు అందిస్తున్నట్లు కూడా వెల్లడించింది. యూరోప్లో మళ్లీ యుద్ధం మొదలైందని, పుతిన్ ఆ యుద్ధాన్ని కాంక్షించారని, మానవ విషాదాన్ని ఆయన క్రియేట్ చేస్తున్నారని, కానీ ఉక్రెయిన్ ప్రజల పక్షాన యూరోప్ దేశాలు అండగా ఉన్నట్లు మాక్రన్ తెలిపారు. వాస్తవానికి ఈ యుద్ధాన్ని నివారించేందుకు మాక్రన్ చాలా ప్రయత్నాలు చేశారు. పలుమార్లు ఆయన పుతిన్తో సంప్రదింపులు జరిపారు. కానీ పుతిన్ను శాంతింపచేయడంలో ఆయన సక్సెస్ కాలేకపోయారు. మరోవైపు ఏప్రిల్లో ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. రెండవ దఫా పోటీలో ఉండాలనుకున్న మాక్రన్కు ఇప్పుడు పెద్ద సవాల్ ఎదురైంది. మార్చి 4వ తేదీ లోపు ఆయన తన అభ్యర్ధిత్వాన్ని ప్రకటించాల్సి ఉంటుంది.