Tiger Memon | ముంబై : ముంబై పేలుళ్ల ప్రధాన సూత్రధారి, మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది దావూద్ ఇబ్రహీంపై విష ప్రయోగం జరిగిందని రెండు రోజుల క్రితం వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఆయన కరాచీలోని ఓ ప్రయివేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నట్లు కూడా కథనాలు వచ్చాయి. 1993లో ముంబైలో జరిగిన వరుస పేలుళ్ల ప్రధాన సూత్రధారి దావూద్ ఇబ్రహీం కాగా, ముఖ్య పాత్రధారి టైగర్ మెమోన్ ఉన్నారు. దావూద్ ఇబ్రహీం పేరు మరోసారి తెరపైకి రావడంతో.. టైగర్ మెమోన్ పేరు కూడా మరోమారు వార్తల్లో నిలిచింది. ముంబై పేలుళ్ల నాటి టైగర్ మెమోన్ ఫోటో, ఇప్పటి ఫోటో అంటూ ఓ వార్త వైరల్ అవుతోంది. అప్పుడు, ఇప్పుడు అంటూ ఆ ఫోటోకు క్యాప్షన్ ఇచ్చారు.
టైగర్ మెమోన్ ప్రస్తుతం కరాచీలోని ఓ విల్లాలో విలాసవంతమైన జీవితం గడుపుతున్నట్లు సమాచారం. ముంబై పేలుళ్ల అనంతరం దుబాయి పారిపోయిన టైగర్ మెమోన్.. ఆ తర్వాతి కాలంలో కరాచీకి తన మకాం మార్చినట్లు సమాచారం. అయితే నాటి వరుస పేలుళ్ల కోసం ముంబైలోని అల్ హుస్సేని బిల్డింగ్లో ఉగ్రవాద కార్యకలాపాలు చేసినట్లు మెమోన్పై ఆరోపణలు ఉన్నాయి.
1993, మార్చి 12వ తేదీన జరిగిన ఈ నరమేధంలో ఏకంగా 257 మంది ప్రాణాలు కోల్పోయారు. అలాగే 1400 మందికి పైగా ఆ బాంబ్ బ్లాస్ట్లో తీవ్రంగా గాయపడ్డారు. వందల కోట్ల ఆస్తినష్టం జరిగింది. ఆ వరుస పేలుళ్లతో ఒక్క ఇండియానే కాదు.. మొత్తం ప్రపంచం ఉలిక్కిపడింది.