బీజింగ్: చైనాలో కూడా ఇన్ఫ్లూయెంజా (Influenza) కేసులు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పర్యాటక కేంద్రమైన ఒక నగరం లాక్డౌన్ ప్రతిపాదన చేసింది. ఫ్లూ కేసులను నియంత్రించేందుకు జన రద్దీ ప్రాంతాలతోపాటు స్కూళ్లు, వ్యాపారాలు మూసివేస్తామని పేర్కొంది. హాంకాంగ్ వైరస్గా వ్యవహరించే హెచ్3ఎన్2 (H3N2) కేసులు ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాల్లో గణనీయంగా పెరుగుతున్నాయి. చైనాలో కూడా గత వారం ఇన్ఫ్లూయెంజా కేసులు బాగా పెరిగినట్లు చైనీస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ శనివారం విడుదల చేసిన వీక్లీ కోవిడ్ రిపోర్ట్లో పేర్కొంది. గత వారంలో ఫ్లూ పాజిటివ్ కేసుల రేటు 41.6 శాతానికి పెరిగినట్లు తెలిపింది. మునుపటి వారం కన్నా 25.1 శాతం ఎక్కువ పెరుగుదల నమోదైనట్లు వెల్లడించింది. అయితే కరోనా పాజిటివిటీ రేటు 5.1 శాతం నుంచి 3.8 శాతానికి తగ్గినట్లు ఆ నివేదికలో పేర్కొంది.
కాగా, షాంగ్సీ ప్రావిన్స్లోని టూరిజం హాట్స్పాట్ అయిన జియాన్ నగరం ఇన్ఫ్లూయెంజా కేసుల పెరుగుదలపై అప్రమత్తమైంది. ఈ వారం అత్యవసర ప్రణాళికలను వెల్లడించింది. ఫ్లూ వ్యాప్తి మరింతగా పెరిగితే లాక్డౌన్ తరహా ఆంక్షలు విధించాలని ప్రతిపాదించింది. పాఠశాలలు, వ్యాపార సముదాయాలు, ఇతర రద్దీ ప్రదేశాలు మూసివేస్తామని పేర్కొంది. అయితే మరోసారి లాక్డౌన్ విధింపు ప్రతిపాదనలపై ఆ దేశ సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి.
మరోవైపు భారత్, చైనాతోపాటు ప్రపంచంలోని పలు దేశాల్లో ఇన్ఫ్లూయెంజా కేసులు పెరుగుతున్నాయి. హాంకాంగ్ వైరస్గా పిలిచే హెచ్3ఎన్2 (H3N2) వైరస్ వల్ల పలు మరణాలు కూడా నమోదయ్యాయి. ఈ వైరస్ సోకిన వారికి సాధారణ ఫ్లూ వైరస్ మాదిరిగా జ్వరం, దగ్గు, జలుబు, శ్వాసకోశ సమస్యలు, శరీరంలో నొప్పులు, వికారం, వాంతులు, అతిసారం వంటి లక్షణాలు ఉంటాయని వైద్య నిఫుణులు చెబుతున్నారు. అలాగే కరోనా మాదిరిగా మరో మహమ్మారిగా ఇది వ్యాప్తి చెందుతుందేమో అన్న భయాందోళనలు కూడా వ్యక్తం చేస్తున్నారు.