స్టాక్హోమ్: ఈ ఏడాది రసాయన శాస్త్ర నోబెల్( Nobel Prize ) ఇద్దరిని వరించింది. జర్మనీకి చెందిన బెంజమిన్ లిస్ట్, అమెరికాకు చెందిన డేవిడ్ డబ్ల్యూసీ మెక్మిలన్లకు కెమిస్ట్రీ నోబెల్ ఇస్తున్నట్లు అకాడమీ ప్రకటించింది. అణువులను నిర్మించడానికి అసిమెట్రిక్ ఆర్గానోకాటలిసిస్ అనే కొత్త మార్గాన్ని అభివృద్ధి చేసినందుకుగాను ఈ ప్రతిష్టాత్మక అవార్డు లిస్ట్, మెక్మిలన్లకు దక్కింది. లిస్ట్, మెక్మిలన్ల ఆవిష్కరణ ఫార్మాసూటికల్ పరిశోధనలపై గొప్ప ప్రభావం చూపిందని అకాడమీ చెప్పింది. విజేతలకు 11 లక్షల డాలర్ల ప్రైజ్మనీని సమానంగా పంచుతారు.
బెంజమిన్ లిస్ట్ 1968లో జర్మనీలోని ఫ్రాంక్ఫర్ట్లో జన్మించారు. 1997లో గోతె యూనివర్సిటీ నుంచి పీహెచ్డీ పూర్తి చేశారు. ప్రస్తుతం మ్యాక్స్ ప్లాంక్ ఇన్స్టిట్యూట్కు డైరెక్టర్గా ఉన్నారు. ఇక మెక్మిలన్ 1968లో యూకేలోని బెల్షిల్లో జన్మించారు. 1996లో యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుంచి పీహెచ్డీ చేశారు. ప్రస్తుతం ప్రిన్స్టన్ యూనివర్సిటీ ప్రొఫెసర్గా ఉన్నారు. విజేతలను బుధవారం రాయల్ స్వీడిష్ అకాడమీ సెక్రటరీ జనరల్ గొరాన్ హాన్సన్ ప్రకటించారు. ఇప్పటికే సోమ, మంగళవారాల్లో మెడిసిన్, ఫిజిక్స్లలో నోబెల్ బహుమతులు ప్రకటించిన విషయం తెలిసిందే.