వాషింగ్టన్: దొంగలు ఒక రేడియో రిలే స్టేషన్లోకి చొరబడ్డారు. 200 అడుగుల పొడవైన రేడియో టవర్, ట్రాన్స్మిటర్, ఇతర పరికరాలను ఎత్తుకెళ్లారు. (radio tower theft) దీంతో ఆ రేడియో ప్రసారాలు బంద్ అయ్యాయి. విస్తూపోయే ఈ సంఘటన అమెరికాలో జరిగింది. ఫిబ్రవరి 2న అలబామాలోని జాస్పర్లో ఉన్న పట్టణ రేడియో స్టేషన్ టవర్ వద్దకు నిర్వహణ సిబ్బంది వచ్చారు. అయితే 200 అడుగుల పొడవైన రేడియో టవర్, ట్రాన్స్మిటర్, ఇతర సామగ్రి మాయం కావడం చూసి వారు షాక్ అయ్యారు. ఈ సంఘటన నేపథ్యంలో ఆ ప్రాంతవాసులకు వార్తలు, ఇతర సమాచారం ప్రసారం చేసే ఆ రేడియో ప్రసారాలు ఆగిపోయాయి.
కాగా, రేడియో టవర్, ప్రసార సామగ్రి చోరీపై రేడియో స్టేషన్ జనరల్ మేనేజర్ బ్రెట్ ఎల్మోర్ స్పందించారు.
1950 నుంచి ప్రసారాలు కొనసాగిస్తున్న తమ రేడియో స్టేషన్ నినాదం ‘వాకర్ కౌంటీ ధ్వని’ అని తెలిపారు. ప్రస్తుతం తమ రేడియో స్టేషన్ డౌన్ కావడంతో ఈ ప్రాంత వాసులు దాని ధ్వనిని కోల్పోయారని, వారిని ఇది ఎంతగానో బాధిస్తున్నదని ఆవేదన వ్యక్తం చేశారు.
మరోవైపు రేడియో స్టేషన్ పునరుద్ధరించేందుకు సుమారు రూ.83 లక్షలు ఖర్చవుతుందని స్టేషన్ మేనేజర్ బ్రెట్ ఎల్మోర్ తెలిపారు. గోఫండ్మి ద్వారా నిధుల సేకరణ ప్రారంభించినట్లు చెప్పారు. రేడియో స్టేషన్ పునరుద్ధరణకు స్థానికులు కూడా ఆర్థిక సహాయం చేస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రేడియో టవర్, ట్రాన్స్మిటర్, ఇతర పరికరాల చోరీ గురించి పోలీసులకు ఫిర్యాదు చేశామని, అయితే ఇంత వరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని వెల్లడించారు.