ఆప్ఘనిస్థాన్ను తాలిబన్లు స్వాధీన పరుచుకోవడంతో.. ఆ దేశానికి చెందిన మహిళ జీవనం ప్రశ్నార్థకంగా మారింది. షరియా చట్టాలకు లోబడి స్త్రీల హక్కులు ఉంటాయని తాలిబన్లు ప్రకటించినప్పటికీ.. మహిళలు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని జీవనం కొనసాగించే పరిస్థితి ఏర్పడింది. ఆఫ్గనిస్తాన్లోని స్త్రీల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. అంతే కాదు.. ఇండియాలో జీవిస్తున్న ఆఫ్ఘన్ ఓ మహిళ కూడా తన జీవితం పట్ల ఆవేదన చెందుతోంది. తాను తాలిబన్లకు కనిపిస్తే చంపేస్తారేమోనని భయపడుతోంది. అసలు ఓ సాధారణ మహిళను చంపడానికి తాలిబన్లకు అవసరమా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఎందుకంటే తన భర్త డబ్బుల కోసం ఇద్దరు ఆడపిల్లలను తాలిబన్లకు అమ్మి.. తాలిబన్గా మారిపోయాడు. తన భర్త చేతిలో తాను ప్రాణాలు కోల్పోతానేమోనని ఆమె ఆందోళన చెందుతోంది. ప్రస్తుతం ఢిల్లీలోని ఉంటున్న ఆ మహిళను ఓ జాతీయ మీడియా ఇంటర్వ్యూ చేసింది.
‘మా స్వస్థలం ఆఫ్ఘనిస్థాన్లోని హిరాత్. నాకు 14 ఏండ్ల వయసున్నప్పుడే పెళ్లి చేశారు. నా భర్త నా కంటే 20 ఏండ్ల పెద్దవాడు. నా కుటుంబాన్ని ఆర్థిక సమస్యలు వెంటాడుతుండటంతో.. తప్పని పరిస్థితుల్లో నిఖాకు అంగీకరించాను. అతని నిజస్వరూపాన్ని నా కుటుంబ సభ్యులు ఎవరూ గుర్తించలేకపోయారు. పెళ్లైన కొద్దిరోజులకే ఆయన నన్ను హింసించడం మొదలు పెట్టాడు. నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయేవాడు. నన్ను చదువుకోనివ్వలేదు. ఒక సర్వర్గా మాత్రమే నన్ను చూశాడు. మాకు నలుగురు ఆడపిల్లలు జన్మించారు. నా భర్త డ్రగ్స్కు బానిస కావడంతో పెద్ద మొత్తంలో అప్పులు చేశాడు. దీంతో అప్పులు తీర్చేందుకు కూతుళ్లను అమ్మకానికి పెట్టాడు. నా పెద్ద కూతురికి 14 ఏండ్లు రాగానే తాలిబన్లకు (రూ. 5 లక్షలు) అమ్మేశాడు. బిడ్డను అమ్మేశాడని నేను ఎంత ఏడ్చినా పట్టించుకున్న వారే లేరు. ఈ విషయం ఎవరికైనా చెబితే.. మిగతా ముగ్గురిని కూడా అమ్మేస్తానని నన్ను హెచ్చరించాడు.
పెద్ద బిడ్డను అమ్మినట్టే రెండో కుమార్తెను కూడా 12 ఏండ్ల వయసులోనే అమ్మేశాడు. దీంతో నాకు నా బిడ్డలను తిరిగి అప్పగించేలా చూడాలని పోలీసులకు ఫిర్యాదు చేశాను. ఈ విషయం తెలుసుకున్న నా భర్త.. నాపై కత్తితో విచక్షణారహితంగా దాడి చేశాడు. మెడపై ఇప్పటికీ గాయాలు ఉన్నాయి. నా మోచేతి, రెండు వేళ్లు పని చేయడం లేదు.
పోలీసులకు ఫిర్యాదు చేసిన తర్వాత తాలిబన్ల నుంచి కూడా నాకు బెదిరింపులు వచ్చాయి. హిరాత్ నుంచి తప్పించుకుపోయిన నా భర్త తాలిబన్ ఫైటర్గా మారాడు. నా మూడో కుమార్తెను కూడా అప్పగించకపోతే చంపేస్తామని తాలిబన్లు బెదిరించారు. ఎందుకంటే మూడో కుమార్తెను అప్పటికే అమ్మేశాడు. ఆ డబ్బును కూడా తీసేసుకున్నాడు.
ఇక ఇద్దరు కూతుళ్లను కోల్పోయిన నేను.. మిగతా ఇద్దర్నీ తాలిబన్ల నుంచి రక్షించుకునేందుకు ఆప్ఘన్ను వదిలి వచ్చాను. హిరాత్కు తిరిగి రావాలని తాలిబన్లు మా ఇంటికి నోటీసులు పంపించారు. డెత్ వారెంట్ కూడా జారీ చేశారు. తొలి ఇద్దరు కూతుళ్ల ఆచూకీ మాత్రం తాలిబన్లు చెప్పడం లేదు. ఆ ఇద్దరు బిడ్డలు ఎక్కడున్నారో? వారికి ఏమైందో కూడా తెలియదు. సజీవంగా ఉన్నారా? చనిపోయి ఉన్నారా? అనేది మాత్రం తెలియదు.
ఇస్లామిక్ చట్టం ప్రకారం మహిళలను గౌరవిస్తామని తాలిబన్లు పదేపదే చెబుతున్నప్పటికీ నమ్మశక్యంగా లేదు. ఆఫ్ఘన్ను స్వాధీనం చేసుకున్న తాలిబన్ల చేతిలో మహిళల జీవనం ప్రశ్నార్థకమే. తాలిబన్ల ఆలోచనలు మారవు అని బలంగా నమ్ముతున్నా. గతంలో ప్రవర్తించిన మాదిరిగానే ఇప్పుడు ప్రవర్తిస్తారు. తాలిబన్లు ప్రపంచానికి శత్రువులు. నాలాంటి మహిళలు ఎంతో మంది తమ బాధలను బయటకు చెప్పుకోవాలని ఉన్నప్పటికీ తాలిబన్లను చూసి భయపడుతున్నారు.
నేను ఇండియాలో ఉన్నట్టు నా భర్తకు తెలిసే ఉంటుంది. ఓ యూట్యూబర్ (ఆఫ్ఘన్ ఛానెల్ ) నా వీడియోను అప్లోడ్ చేయడంతో.. నా భర్తకు ఇండియాలో ఉంటున్నట్టు తెలిసిపోయింది అనుకుంటున్నాను. ఆఫ్ఘనిస్థాన్ను తాలిబన్లు ఆక్రమించుకున్నప్పటి నుంచి నిద్రలేని రాత్రులు గడుపుతున్నాను. నా తల్లిదండ్రులు, అన్నదమ్ముళ్లు, అక్కాచెల్లెళ్లు హిరాత్లోనే నివాసం ఉంటున్నారు. హిరాత్లో ఇంటర్నెట్ సదుపాయం సరిగా లేకపోవడంతో నా కుటుంబ సభ్యులతో మాట్లాడలేకపోతున్నాను. వారి ముఖాలను కూడా చూడలేకపోతున్నాను. నా కుటుంబం గురించి ఆలోచించినప్పుడల్లా భయమేస్తోంది’ అని ఫరీబా అకేమీ చెప్పింది.